కోర్టులో హాజరైన టీటీవీ దినకరన్: ఏం తమాషానా, వార్నింగ్ ఇచ్చిన జడ్జి !
చెన్నైలోని ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి మలర్ మతి టీటీవీ దినకరన్ న్యాయవాదిని మందలించారు. కేసు విచారణను తప్పుదోవపట్టించడానికి ప్రయత్నిస్తున్నారని న్యాయవాదిపై మండిపడ్డారు.
చెన్నై: అన్నాడీఎంకే పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి పదవి నుంచి బహిష్కరణకు గురైన టీటీవీ దినకరన్ బుధవారం (ఏప్రిల్ 19) చెన్నైలోని ఎగ్మూరులో ఉన్న ప్రత్యేక న్యాయస్థానం (ఎకనామిక్ అఫెన్స్ కోర్టు)లో హాజరైనాడు.
నియమాలు ఉల్లంఘించి విదేశాల నుంచి అక్రమంగా నగదు లావాదేవీలు నిర్వహించారని టీటీవీ దినకరన్ మీద నమోదు అయిన కేసులో ఆయన విచారణకు హాజరైనారు. బుధవారం ప్రత్యేక కోర్టు ముందు టీటీవీ దినకరన్ తన న్యాయవాదులతో కలిసి హాజరైనారు.
ఆయనకు తెలీదు
టీటీవీ దినకరన్ న్యాయవాదులు తన కక్షిదారుడు ఎలాంటి తప్పు చెయ్యలేదని కోర్టు ముందు వాదించారు. దినకరన్ చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరించలేదని, ఆయన మీద నమోదు అయిన కేసును కొట్టివెయ్యాలని ఆయన న్యాయవాదులు కోర్టులో మనవి చేశారు.
మండిపడిన న్యాయమూర్తి
ఫెరా కేసు విచారణ జరుగుతున్న సమయంలో న్యాయమూర్తి మలర్ మతి టీటీవీ దినకరన్ న్యాయవాదిపై మండిపడ్డారు. మీరు కేసు విచారణ తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తున్నారని, ఏం తమాషాలు చేస్తున్నారా అంటూ మందలించారు. ఈ దెబ్బతో దినకరన్ షాక్ కు గురైనాడు.
మళ్లీ రమ్మని చెప్పిన కోర్టు
బుధవారం ఉదయం ఫెరా కేసు విచారణకు హాజరైన దినకరన్ చాల సేపు కోర్టులో ఉన్నారు. తరువాత న్యాయమూర్తి మలర్ మతి మద్యాహ్నం మూడు గంటలకు మళ్లీ కేసు విచారణకు హాజరుకావాలని దినకరన్ కు సూచించారు.
ఎమ్మెల్యేలతో మీటింగ్ అంటూ
బుధవారం ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేశారు. అత్యవసరంగా ఏర్పాటు చేసిన సమావేశానికి ఎమ్మెల్యేలు అందరూ హాజరుకావాలని దినకరన్ ఆదేశించారు. అయితే చివరి నిమిషంలో ఎమ్మెల్యేల సమావేశం రద్దు అయ్యిందని దినకరన్ మీడియాకు చెప్పారు.
మీతో మాకేం పని చెప్పండి
దినకరన్ పిలిచిన సమావేశానికి హాజరుకాకూడదని, ఆయనతో మనకు ఏం పని ఉంది చెప్పండి అంటూ పలువురు ఎమ్మెల్యేలు నిర్ణయించిన తరువాతే దినకరన్ చివరి నిమిషంలో సమావేశం రద్దు చేసుకున్నారని వెలుగు చూసింది.
ఏకాకి అవుతున్న దినకరన్
శశికళ, దినకరన్ ను పార్టీ నుంచి బహిష్కరించిన తరువాత వారి కుటుంబ సభ్యుల పరిస్థితి తారుమారు అవుతున్నది. ప్రస్తుతం దినకరన్ ఏకాకి అవుతున్నాడు. ఆయనతో పెట్టుకుంటే లేనిపోని సమస్యలు వచ్చే అవకాశం ఉందని అన్నాడీఎంకే పార్టీ నాయకులు భయపడుతున్నారు.
విచారణకు హాజరుకావాల్సిందే
ఇప్పటికే ఫెరా కేసు విచారణకు కచ్చితంగా హాజరుకావాలని దినకరన్ కు న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు విచారణ పూర్తి అయ్యే వరకు న్యాయస్థానం ఎప్పుడు పిలిస్తే అప్పుడు దినకరన్ కోర్టు ముందు హాజరుకావాల్సి ఉంటుంది.
టీటీవీ దినకరన్ కు కష్టకాలం
టీటీవీ దినకరన్ అన్నాడీఎంకే పార్టీ సీనియర్ నేతలను పక్కన పెట్టి ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుని ఇంత వరకు తెచ్చుకున్నారని సమాచారం. పార్టీలో అంతా తానే పెత్తనం చెలాయించాలని ప్రయత్నించడంతో మొదటికే మోసం వచ్చిందని శశికళ వర్గీయులు తలలుపట్టుకున్నారు.