సుప్రీంకోర్టు తదుపరి సీజేఐగా రంజన్ గొగొయ్
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రంజన్ గొగొయ్ పేరును ప్రస్తుత చీఫ్ జస్టిస్ దీపిక్ మిశ్రా సిఫార్సు చేసినట్లు తెలిసింది. మిశ్రా పదవీ కాలం వచ్చే అక్టోబరు 2వ తేదీతో ముగియనుంది.
ఈ నేపథ్యంలోనే తదుపరి సీజేఐగా ఎవరిని నియమించాలనే దానిపై ఒకరి పేరును సీజేఐ నెల రోజులు ముందుగానే న్యాయశాఖకు సిఫార్సు చేయాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా జస్టిస్ గొగొయ్ పేరును ప్రతిపాదించారు.
ఇందుకు కేంద్ర న్యాయశాఖ ఆమోదం పొందిన అనంతరం తదుపరి సీజేఐగా జస్టిస్ గొగొయ్ నియమితులు కానున్నారు. అదే జరిగితే అక్టోబరు 3న ఆయన నూతన సీజేఐగా ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది.
జస్టిస్ గొగొయ్ 2001, ఫిబ్రవరి 28న గువాహటి హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆ తర్వాత ఆయన పంజాబ్, హర్యానా హైకోర్టుకు చీఫ్ జస్టిస్గా బాధ్యతలు నిర్వర్తించారు. 2012లో సర్వోన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తిగా చేరారు.