నాకొద్దు ఆ కేసు.. తప్పుకుంటున్న జడ్జీలు..!
ఢిల్లీ : సీబీఐ తాత్కాలిక డైరెక్టర్ నియామకంపై దాఖలైన పిటిషన్ విచారణలో, జడ్జిలు ఒక్కొక్కరుగా తప్పుకుంటున్నారు. చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్, న్యాయమూర్తి జస్టిస్ సిక్రి ఇప్పటికే ఈ కేసు విచారణలో వెనక్కి తగ్గారు. తాజాగా జస్టిస్ ఎన్వీ రమణ కూడా తప్పుకోవడంతో ఈ అంశం చర్చానీయాంశంగా మారింది.
ఆ కేసుకు దూరం
కేంద్ర దర్యాప్తు సంస్థకు సంబంధించి దాఖలైన పిటిషన్ పై విచారణ జరిపేందుకు.. జడ్జీలు ఒక్కొక్కరుగా తప్పుకుంటుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. జస్టిస్ రంజన్ గొగొయ్, జస్టిస్ ఇక్రి ఇదివరకే తప్పుకోగా.. తాజాగా జస్టిస్ ఎన్వీ రమణ సైతం నో చెప్పేయడం చర్చకు దారి తీసింది. కారణాలు ఏవైనా జడ్జీలు ఇలా ఎందుకు తప్పుకుంటున్నారనే ఊహాగానాలు జోరందుకున్నాయి.
ఎందుకలా?
ఇటీవల సీబీఐ తాత్కాలిక డైరెక్టర్ గా నాగేశ్వర్ రావును కేంద్రం నియమించింది. అయితే ఆయన నియామకాన్ని సవాల్ చేస్తూ కామన్ కాజ్ అనే స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీంతో ఆ పిటిషన్ చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని బెంచ్ కు వచ్చింది. అయితే అనూహ్యంగా ఆయన పక్కకు తప్పుకున్నారు. సీబీఐకి కొత్త డైరెక్టర్ ను ఎంపిక చేసే హై లెవెల్ కమిటీలో తాను సభ్యుడిగా ఉన్నందున తప్పుకుంటున్నట్లు చెప్పారు. అనంతరం ఆ పిటిషన్ జస్టిస్ సిక్రి నేతృత్వంలోని ధర్మాసనానికి చేరింది. ఆయన కూడా ఈ పిటిషన్ పై విచారణ జరపకుండా తప్పుకున్నారు. అలోక్ వర్మను సీబీఐ డైరెక్టర్ పదవి నుంచి తొలగించిన కమిటీలో మెంబర్ గా ఉన్నందున తప్పుకుంటున్నట్లు తెలిపారు.
ఒక్కొక్కరుగా పక్కకు..!
జస్టిస్ సిక్రి తర్వాత ఆ పిటిషన్.. జస్టిస్ ఎన్వీ రమణ ధర్మాసనానికి చేరింది. అయితే ఆయన కూడా విచారణ చేయబోనంటూ తప్పుకున్నారు. అలా ముగ్గురు జడ్జీలు విచారణ చేయకుండా తప్పుకోవడంతో ఆ అంశం ఇప్పుడు చర్చానీయాంశంగా మారింది. అయితే సీబీఐ తాత్కాలిక డైరెక్టర్ గా నియమితులైన నాగేశ్వర రావు, తాను ఒకే రాష్ట్రానికి చెందినవారమని అంటున్నారు జస్టిస్ ఎన్వీ రమణ. నాగేశ్వర రావు కుమార్తె వివాహానికి కూడా తాను హాజరయినట్లు తెలిపారు. అందుకే విచారణలో పారదర్శకత ఉండాలనే ఉద్దేశంతో ఆ పిటిషన్ విచారణ నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పారు.