నాలా నా కొడుకు సీఎం వద్దు: రంజన్ గురించి నాడు తండ్రి ఏం చెప్పాడంటే? అసోం హిస్టరీ
Recommended Video
న్యూఢిల్లీ: భారత 46వ ప్రధాన న్యాయమూర్తిగా (చీఫ్ జస్టిస్) జస్టిస్ రంజన్ గొగోయ్ బుధవారం బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ ఆయనచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈశాన్య రాష్ట్రాల నుంచి తొలి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రంజన్.
ఈశాన్య రాష్ట్రాలలోని అసోంకు చెందిన రంజన్ సీజేఐగా ప్రమాణ స్వీకారం చేయడంతో అసోం కొత్త చరిత్ర సృష్టించింది. రంజన్ గొగోయ్ 17 నవంబర్ 2019 వరకు సీజేఐగా ఉండనున్నారు. అప్పుడు అతనికి 65 ఏళ్లు వస్తాయి. ఈయన బార్ అసోసియేషన్లో 1978లో చేరారు. గుజరాత్ హైకోర్టులో పని చేశారు. ఆ తర్వాత హర్యానా, పంజాబ్లలో పని చేశారు. 23 ఏప్రిల్ 2012న ఆయన సుప్రీం కోర్టు జడ్జిగా అయ్యారు.
ప్రమాణస్వీకారం: సుప్రీంకోర్టు 46వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రంజన్ గొగోయ్
రంజన్ గొగోయ్ తండ్రి ముఖ్యమంత్రి
రంజన్ గొగోయ్ కుటుంబం రాజకీయాల్లో ఉంది. ఆయన తండ్రి కేశబ్ చంద్ర గొగోయ్ అసోం ముఖ్యమంత్రిగా పని చేశారు. కేశబ్ చంద్ర గొగోయ్ కాంగ్రెస్ నేత. అసోం తొమ్మిదో ముఖ్యమంత్రిగా పని చేశారు. ముఖ్యమంత్రిగా పని చేసిన కేశబ్ చంద్ర గొగోయ్ తన కొడుకు రంజన్ గొగోయ్ తనలా ముఖ్యమంత్రి కావాలని కోరుకోలేదు. భారత ప్రధాన న్యాయమూర్తి కావాలని కోరుకున్నారు.
కొద్ది మంది జడ్జిల్లో రంజన్
రంజన్ గొగోయ్ ఇప్పుడు సీజేఐ కావడం ద్వారా తండ్రి కల నెరవేరింది. తన కొడుకు సీజేఐ అవుతాడన్న తండ్రి మాటలను నిజం చేశారు. రంజన్ గొగోయ్ చాలా సాధారణంగా ఉంటారు. సామాన్యుల్లో తండ్రితో కలిసి వెళ్లి ఢిల్లీ మార్కెట్లో చేపలు కొనుగోలు చేసేవారట. రంజన్ గొగోయ్కు సొంత కారు లేదు. పెద్ద ఇల్లు లేదు. అతని తల్లి సామాజిక కార్యకర్త. కోర్టు వెబ్ సైట్లో తన ఆస్తులు ప్రకటించిన కొద్దిమంది జడ్జిల్లో రంజన్ ఒకరు.
నా కొడుకు నా కంటే గొప్పవాడు అవుతాడు
రంజన్ గొగోయ్ తండ్రి కేశబ్ చంద్ర గొగోయ్ 1982లో అక్రమ వలసదారుల గొడవలు జరుగుతున్న సమయంలో 66 రోజుల పాటు అసోం సీఎంగా పని చేశారు. అదే సందర్భంలో న్యాయశాఖ మంత్రిగా పనిచేసిన అబ్దుల్ ముహీబ్ మజుందార్ ఆయనను ఒక ప్రశ్న అడిగారు. మీలాగే మీ తనయుడు కూడా ఏదో ఒక రోజు అసోం సీఎం అవుతారని అనుకుంటున్నారా అని ప్రశ్నించారు. దానికి కేశబ్ చంద్ర గొగోయ్ స్పందిస్తూ... తన కొడుకు తన కంటే గొప్పవాడు అవుతాడని, ఏదో ఓ రోజు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అవుతాడని చెప్పారు. ఈ విషయాన్ని ప్రముఖ డాక్యుమెంటర్ అరూప్ కుమార్ దత్తా తన బుక్ ఇన్ గౌహతి హైకోర్టు: హిస్టరీ అండ్ హెరిటేజ్ బుక్లో పేర్కొన్నారు.
రంజన్ గొగోయ్ ప్రత్యేకతలు కొన్ని
కేశవ్ చంద్ర గొగొయ్ కూడా లాయర్గా పనిచేసి తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. రంజన్కు నలుగురు తోబుట్టువులు. ఆయన పెద్దన్న అంజన్ కుమార్ గొగోయ్ ఎయిర్ మార్షల్గా పని చేసి రిటైర్ అయ్యారు. ఒకేలా ఉన్న పలు కేసులను కలిపి విని, అన్నింటిని ఒకేసారి పూర్తి చేయడం రంజన్ గొగోయ్ ప్రత్యేకత. 2016లో ఓ కేసులో భాగంగా మాజీ సుప్రీం కోర్టు జడ్జి మార్కండేయ కట్జుకు కోర్టు ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. ఇలా చేసిన తొలి సుప్రీం న్యాయమూర్తి రంజన్. ఆరుషి హత్య కేసును విచారించారు. ఈ ఏడాది జనవరిలో మరో ముగ్గురు న్యాయమూర్తులతో కలిసి చరిత్రలో తొలిసారి ప్రెస్మీట్ నిర్వహించి అప్పటి చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రాపై ఆరోపణలు చేశారు.