సుప్రీంకోర్టు 47వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎస్ఏ బోబ్డే ప్రమాణస్వీకారం
Recommended Video
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు 47వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎస్ఏ బోబ్డే ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రమాణ స్వీకారం చేయించారు. చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ పదవీవిరమణ చేయడంతో ఆయన వారసుడిగా 63 ఏళ్ల శరద్ అరవింద్ బోబ్డే ప్రమాణ స్వీకారం చేశారు. 2021 ఏప్రిల్ 23 వరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎస్ఏ బోబ్డే సేవలు అందిస్తారు. జస్టిస్ బోబ్డే తర్వాత జస్టిస్ ఎన్వీ రమణ, యూయూ లలిత్, డీవై చంద్రచూడ్లు వరసగా ప్రధాన న్యాయమూర్తి రేసులో ఉన్నారు.
చీఫ్ జస్టిస్ బోబ్డే పలు కీలక తీర్పులు ఇచ్చిన ధర్మాసనంలో ఉన్నారు. ముఖ్యంగా అయోధ్య భూవివాదం కేసులో అప్పటి చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనంలో సభ్యులుగా ఉన్నారు. 2017లో ప్రైవసీ అనేది ప్రాథమిక సూత్రాల కిందకు వస్తుందని చెప్పారు చీఫ్ జస్టిస్ ఎస్ఏ బోబ్డే. అదే సమయంలో ప్రభుత్వ సేవలు అందాలంటే భారతీయ పౌరుడికి ఆదార్ తప్పనిసరి అని 2015లో తీర్పు చెప్పారు ఎస్ఏ బోబ్డే.
జస్టిస్ ఎస్ఏ బోబ్డే మహారాష్ట్రలోని నాగ్పూర్లో జన్మించారు. నాగ్పూర్ యూనివర్శిటీ నుంచి న్యాయశాస్త్రంలో డిగ్రీ చేశారు. ఆ తర్వాత 1978లో బార్కౌన్సిల్ ఆఫ్ మహారాష్ట్రలో రిజిస్టర్ అయ్యారు.1998లో సీనియర్ అడ్వకేట్ డెసిగ్నేట్ను పొందారు. మార్చి 2000లో తొలిసారిగా బాంబే హైకోర్టు అడిషనల్ జడ్జిగా బాధ్యతలు చేపట్టారు జస్టిస్ ఎస్ఏ బోబ్డే.
#WATCH Delhi: Justice Sharad Arvind Bobde takes oath as the 47th Chief Justice of India. He succeeds Justice Ranjan Gogoi. pic.twitter.com/Spb5Eys5KS
— ANI (@ANI) November 18, 2019
అనంతరం మధ్యప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్గా అక్టోబర్ 2012లో బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత 2013లో సుప్రీంకోర్టు జడ్జిగా బాధ్యతలు చేపట్టారు. ఇక సుప్రీంకోర్టు 46వ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నవంబర్ 17న పదవీవిరమణ చేయడంతో 47వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎస్ఏ బోబ్డే బాధ్యతలు చేపట్టారు. ఈకార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోడీతో సహా పలువురు కేంద్రమంత్రులు హాజరయ్యారు.