Disha case encounter: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బోబ్డే కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: అత్యాచార కేసుల్లో త్వరగా తీర్పులు చెప్పాలన్న డిమాండ్లపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బోబ్డే కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్కౌంటర్లపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. వెంటనే తీర్పు చెప్పడం సరికాదన్నారు.
Disha case encounter: అందుకే ఎన్కౌంటర్ చేయగలిగారు: ఆయేషా మీరా తల్లి సంచలన వ్యాఖ్యలు
న్యాయం ప్రతీకారంగా మారకూడదు..
జస్టిస్(న్యాయం) అనేది ప్రతీకారంగా మారితే న్యాయం రూపు రేఖలు కోల్పోతుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి శరద్ అరవింద్ బోబ్డే శనివారం వ్యాఖ్యానించారు. రేప్ కేసుల్లో త్వరగా తీర్పులు చెప్పాలన్న కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ వ్యాఖ్యలతో విభేదించారు సీజేఐ. జోధ్పూర్లో ఓ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ.. ‘న్యాయం అనేది సత్వరంగా జరగాలనడం సరికాదు. న్యాయం అనేది ప్రతీకారంగా మారితే.. న్యాయం రూపు మారిపోతుంది' అని అన్నారు. హైదరాబాద్లో వెటర్నరీ డాక్టర్ దిశ నిందితుల ఎన్కౌంటర్ తర్వాత ఇలాంటి అన్ని కేసుల్లోనూ నిందితులను ఎన్కౌంటర్ చేయాలంటూ డిమాండ్లు పెరిగిపోయాయి. మరోవైపు ఇలా ఎన్కౌంటర్లు చేయడం కూడా సరిదనే వాదనలు వినిపిస్తున్నాయి.
సత్వర న్యాయం జరగాలంటూ మంత్రి..
రాజస్థాన్ హైకోర్టు భవనం ప్రారంభోత్సవానికి సీజేఐ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి రవిశంకర్ కూడా వచ్చారు. అత్యాచార కేసుల్లో సత్వర న్యాయం జరిగేలా చూడాలని రవిశంకర్ ప్రసాద్ సీజేఐని కోరారు. ప్రస్తుతం ఉన్న వ్యవస్థను మరింత బలోపేతం చెసి వీలైనంత త్వరగా న్యాయం చేయగలగాలని అన్నారు. ఆ న్యాయం ఆమోద యోగ్యంగా ఉండాలని వ్యాఖ్యానించారు. కొత్త సాంకేతికతను అందిపుచ్చుకోవడం, మధ్యవర్తిత్వం ద్వారా సమస్యను పరిష్కరించుకునే విధానం పెరగాలని అభిప్రాయపడ్డారు.
సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో...
కాగా, దిశ కేసులో నిందితులను ఎన్కౌంటర్ చేయడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టు, తెలంగాణ హైకోర్టులోనూ పిటిషన్లు దాఖలయ్యాయి. పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆ పిటిషన్లలో కోరారు. ఎన్కౌంటర్ను జాతీయ మానవ హక్కుల సంఘం కూడా సుమోటోగా తీసుకుని దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. దిశ కేసులో నిందితులను ఎన్కౌంటర్ చేయడంపై దేశ వ్యాప్తంగా తెలంగాణ పోలీసులపై ప్రశంసలు వెల్లువెత్తాయి. అదే సమయంలో ఇలా నిందితులను ఎన్కౌంటర్ చేయడం సరికాదంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.