మధ్యంతర సీబీఐ ఛీఫ్ నియామకం కేసులో మరో ట్విస్టు: కేసును విచారణ చేయలేనన్న జస్టిస్ ఏకే సిక్రీ
న్యూఢిల్లీ: సీబీఐ మధ్యంతర డైరెక్టర్గా నాగేశ్వరరావు నియామకం చెల్లదన్న పిటిషన్ను సుప్రీంకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. విచారణకు కొద్ది గంటల ముందు తాను విచారణ చేసే బెంచ్లో ఉండేందుకు తిరస్కరించారు జస్టిస్ ఏకే సిక్రీ. జస్టిస్ ఏకే సిక్రీ నిర్ణయం మరోసారి వివాదాస్పదంగా మారింది. జస్టిస్ సిక్రి తన పదవీవిరమణ తర్వాత లండన్ ట్రిబ్యునల్లో చేరనున్నారు. ఇప్పటికే ఆయన నియామకం గురించి స్పష్టత కూడా వచ్చింది. అంతకుముందు ఛీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ కూడా కేసు విచారణ నుంచి తప్పుకున్నారు.
ఇక చివరి నిమిషంలో జస్టిస్ సిక్రీ విచారణ బెంచ్ నుంచి తప్పుకోవడంతో కేసును శుక్రవారానికి వాయిదా వేసింది ధర్మాసనం. అలోక్వర్మను సీబీఐ డైరెక్టర్గా తొలగించిన సీబీఐ సెలెక్షన్ ప్యానెల్లో జస్టిస్ సిక్రీ సభ్యుడిగా ఉన్నారు. అలోక్ వర్మను సీబీఐ ఛీఫ్గా తొలగించాలన్న ప్రభుత్వ నిర్ణయంతో జస్టిస్ సిక్రీ కూడా ఏకీభవించారు. ఈ క్రమంలోనే తాను పిటిషన్ను విచారన చేయలేనని జస్టిస్ సిక్రీ పేర్కొన్నారు.
అలోక్వర్మను సీబీఐ ఛీఫ్గా తొలగించిన తర్వాత కొత్త డైరెక్టరు నియమించేవరకు డైరెక్టరుగా నాగేశ్వరరావును నియమిస్తూ ప్రభుత్వం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈ క్రమంలోనే నాగేశ్వరరావు నియామకం సరిగ్గా జరగలేదంటూ ఆర్టీఐ యాక్టివిస్టు అంజని భరద్వాజ్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హైపవర్ కమిటీ సూచనల ప్రకారం నాగేశ్వరరావు నియామకం జరగలేదంటూ తన పిటిషన్లో పేర్కొన్నారు భరద్వాజ. ఈ క్రమంలోనే ఛీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ కేసు విచారణ నుంచి తప్పుకుంటూ ఆ బాధ్యతలను జస్టిస్ ఏకే సిక్రీకి అప్పగించారు. అయితే జస్టిస్ సిక్రీ కూడా కేసు విచారణ చేపట్టలేనంటూ చెప్పడంతో కేసు విచారణ శుక్రవారానికి వాయిదా పడింది.