చిదంబరంకు బెయిల్ నిరాకరించిన జస్టిస్ సునీల్ గౌర్ రిటైడ్, సోనియా గాంధీ, రాహుల్ కేసు !
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా స్కాం కేసులో కేంద్ర మాజీ హోం శాఖా మంత్రి పి. చిదంబరంకు ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించిన న్యాయమూర్తి జస్టిస్ సునీల్ గౌర్ రిటైర్ అయ్యారు. దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన అనేక కేసులను జస్టిస్ సునీల్ గౌర్ విచారణ చేశారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కేసును జస్టిస్ సునీల్ గౌర్ విచారణ చేశారు.
జస్టిస్ సునీల్ గౌర్ ఐఎన్ఎక్స్ మీడియా కేసు మాత్రమే కాదు, అంతకు ముందు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు చెందిన నేషనల్ హెరాల్డ్ కేసు, అగస్టా వెస్ట్ ల్యాండ్ హెలికాప్టర్ల కొనుగోలు కుంభకోణం కేసు, శివానీ భట్నాగర్ హత్య కేసుతో పాటు అనేక సంచలన కేసుల విచారణ చేశారు.
అగస్టా వెస్ట్ ల్యాండ్ హెలికాప్టర్ ల కొనుగోలు కుంభకోణం కేసులో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్ అల్లుడు, ప్రముఖ వ్యాపారి రతుల్ పురి తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని మనవి చేశారు. మధ్యప్రదేశ్ సీఎం కమల్ నాథ్ అల్లుడు రతుల్ పురికి ముందస్తు బెయిల్ ఇవ్వడానికి జస్టిస్ సునీల్ గౌర్ నిరాకరించారు.
ఐఎన్ఎక్స్ మీడియా స్కాం కేసులో కేంద్ర మాజీ హోం శాఖా మంత్రి పి. చిదంబరం కింగ్ పిన్ అని, ఆయనకు బెయిల్ ఇవ్వడం కుదరదని జస్టిస్ సునీల్ గౌర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధికార పత్రికను ముద్రిస్తున్న అసోసియేటెడ్ జనరల్స్ లిమిటెడ్ ని వెంటనే మీ కార్యాలయం ఖాళీ చెయ్యాలని జస్టిస్ సునీల్ గౌర్ ఆదేశించారు. ప్రస్తుతం ఈ కేసు సుప్రీం కోర్టులో విచారణలో ఉంది.
62 ఏళ్ల జస్టిస్ సునీల్ గౌర్ 1957లో బులందర్ లో జన్మించారు. 1984లో హర్యానా, పంజాబ్ హైకోర్టు న్యాయవాదిగా ఆయన తన వృత్తిని కొనసాగించారు. ఆ సమయంలో అనేక సివిల్, క్రిమినల్ కేసులు వాదించారు. 1995లో ఢిల్లీ హై కోర్టు జ్యుడీషియల్ సేవల భాద్యతలను సునీల్ గౌర్ చేపట్టారు. 2008 ఏప్రిల్ 11వ తేదీన ఢిల్లీ హై కోర్టు తాత్కాలిక జడ్జిగా భాద్యతలు స్వీకరించారు. 2012లో ఢిల్లీ హైకోర్టు పూర్తి స్థాయి న్యాయమూర్తిగా సునీల్ గౌర్ భాద్యతలు స్వీకరించారు.