కసబ్కు ఉరి శిక్ష వేసిన న్యాయమూర్తికి వీడ్కోలు
ముంబై: ముంబై 26/11 దాడులు చేసిన పాకిస్థాన్ ఉగ్రవాది అజ్మల్ కసబ్ కు ఉరి శిక్ష విధిస్తు తీర్పు ఇచ్చిన జస్టిస్ ఎం.ఎల్. తహిల్యానీ ఈనెల 21వ తేది శుక్రవారం ఉద్యోగ విరమణ చెయ్యనున్నారు. గురువారం ముంబై లో ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు.
అడ్వకేట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో న్యాయవాదులు వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పలువురు న్యాయమూర్తులతో పాటు, సీనియర్ న్యాయవాదులు హాజరైనారు. జస్టిస్ ఎం.ఎల్. తహిల్యానీ 28 సంవత్సరాల పాటు వివిధ చోట్ల సేవలు అందించారు.
చివరికి బాంబే హై కోర్టు జడ్జిగా రిటైర్ అవుతున్నారు. ఉగ్రవాది అజ్మల్ కసబ్ ను విచారణ చేస్తున్న సమయంలో కసబ్ పలు వెకిలి చేష్టలు చేసినా న్యాయమూర్తి ఎం.ఎల్. తహిల్యానీ మౌనంగానే పరిశీలించారు. చాల ఓపికగా అజ్మల్ కసబ్ నుండి వివరాలు బయటకు లాగారు.
చివరికి 2014 అగస్టు 29వ తేదిన అజ్మల్ కసబ్ కు ఉరి శిక్ష విధిస్తు సంచలనమైన తీర్పు ఇచ్చారు. తరువాత జస్టిస్ ఎం.ఎల్ తహిల్యానీ ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు సమర్థించింది. జస్టిస్ తహిల్యానీ సేవలు ఉపయోగించుకోవాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
మహారాష్ట్ర లోకాయుక్త న్యాయమూర్తిగా తహిల్యానీని నియమిస్తు ప్రభుత్వం నెల క్రితమే ఆదేశాలు జారీ చేసింది. శుక్రవారం పదవీ విరమణ చేస్తున్న జస్టిస్ తహిల్యానీ కేవలం రెండు రోజులు మాత్రం సెలువు తీసుకుంటున్నారు. ఈనెల 24వ తేదిన లోకాయుక్త న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరిస్తున్నారు.