సిగ్గుతో ఉరేసుకోవాలి... 'జస్టిస్ ఫర్ సుశాంత్' బోగస్ ప్రచారం... రియా లాయర్ కన్నెర్ర...
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య వ్యవహారం నిత్యం వార్తల్లో నానుతూనే ఉంది. కేసుకు రాజకీయ రంగు పులమడంతో మరింత హీట్ పెరిగింది. సుశాంత్ది ఆత్మహత్యేనని ఎయిమ్స్ రిపోర్టు వచ్చిన తర్వాత కూడా అనుమానాలకు తెరపడట్లేదు. ఈ నేపథ్యంలో రియా చక్రవర్తి న్యాయవాది సతీష్ మానేషిండే తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. అసలు 'జస్టిస్ ఫర్ సుశాంత్' అనే క్యాంపెయిన్ వట్టి బోగస్ అని కొట్టిపారేశారు.
విచారణ ఓ కొలిక్కి రాకముందే...
'విచారణలో చివరకు ఏం తేలుతుందో తెలియాలంటే సీబీఐ దర్యాప్తు ఒక కొలిక్కి వచ్చేదాకా వేచి చూడాలి. అంతే కానీ సీబీఐ దర్యాప్తు కొనసాగుతున్న సమయంలోనే ముంబై పోలీసులు,ఎయిమ్స్ వైద్యులపై కొంతమంది నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. వాళ్లు కోరుకున్నట్లుగా ఎయిమ్స్ రిపోర్టు రాకపోవడంతో మళ్లీ మళ్లీ ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. జస్టిస్ ఫర్ సుశాంత్ అనేది ఒక బోగస్ ప్రచారం...' అని మానేషిండే మండిపడ్డారు.
సిగ్గుతో ఉరేసుకోవాలి....
'ఎవరైతే జస్టిస్ ఫర్ సుశాంత్ సింగ్ అని క్యాంపెయిన్ చేస్తున్నారో... వాళ్లంతా సిగ్గుతో ఉరేసుకోవాలి. సుశాంత్కు డ్రగ్స్ అలవాటు ఉందన్న విషయం బయటపడింది. అయినప్పటికీ అతని కుటుంబం,మీడియా తప్పుడు కథనాల వల్ల ఇదంతా జరిగింది. వాళ్లంతా సిగ్గుతో తమ తలకు ఉరేసుకోవాలి...' అని మానేషిండే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.అటు మహారాష్ట్ర మంత్రి జయంత్ పాటిల్ మాట్లాడుతూ... ఎయిమ్స్ వైద్యులు ఇచ్చిన రిపోర్టుతో ముంబై పోలీసులు కేసును సరిగానే డీల్ చేశారన్న విషయం స్పష్టమైందన్నారు.సుశాంత్ ఆత్మహత్య ఎపిసోడ్లో మహారాష్ట్ర ప్రభుత్వాన్ని నిందించినవాళ్లకు ఇదో చెంప పెట్టు లాంటిదన్నారు.
ఆత్మహత్యేనని చెప్పిన ఎయిమ్స్
సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణంపై ఇటీవల ఫోరెన్సిక్ నివేదికను వెల్లడించిన ఎయిమ్స్ వైద్యులు అతనిది ఆత్మహత్యేనని వెల్లడించిన సంగతి తెలిసిందే. సుశాంత్పై విష ప్రయోగం జరిగిందని,గొంతు నులిమారని వచ్చిన రకరకాల ఆరోపణలను నివేదిక తోసిపుచ్చింది. సుశాంత్ది హత్య అని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేసింది. ఫోరెన్సిక్ చీఫ్ సుధీర్ గుప్తా నేత్రుత్వంలోని కమిటీ ఈ రిపోర్టును సీబీఐకి సమర్పించింది.
అయినా అనుమానాలే...
మరోవైపు కంగనా రనౌత్ లాంటి వాళ్లు ఇప్పటికీ సుశాంత్ ఆత్మహత్యపై అనుమానం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. సినిమాలు ఇవ్వకుండా సుశాంత్ను మానసికంగా వేధించారని... అతనిపై కుట్రలు చేశారని కంగనా ఆరోపిస్తున్నారు. ఏదో ఒకరోజు అలా నిద్ర లేవగానే తమకు తాము అలా ఆత్మహత్యలకు ఎవరూ పాల్పడరని అన్నారు. కాగా,జూన్ 14న సుశాంత్ ముంబైలోని తన నివాసంలో విగతజీవిగా కనిపించిన సంగతి తెలిసిందే. తొలుత ఈ కేసును ముంబై పోలీసులు విచారించగా... ఆ తర్వాత సుప్రీంకోర్టు సీబీఐకి అప్పగించింది. ఇదే కేసులో డ్రగ్స్ వ్యవహారం వెలుగుచూడగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఇప్పటికే పలువురు హీరోయిన్లను విచారించింది. ప్రస్తుతం ఈ కేసులో సీబీఐ,ఎన్సీబీ విచారణ కొనసాగుతున్నాయి.