ప్రద్యుమ్నకేసులో ట్విస్ట్: ఆ నిందితుడు వయోజనుడే: సమ్మతించిన కోర్టు
న్యూఢిల్లీ: దేశంలో సంచలనం సృష్టించిన ర్యాన్ స్కూల్ విద్యార్థి ప్రద్యుమ్న హత్య కేసు మరో మలుపు తిరిగింది. ప్రద్యుమ్నను హత్య చేసిన 11వ తరగతి విద్యార్థిని వయోజనుడిగానే పరిగణించేందుకు కోర్టు అంగీకారం తెలిపింది.
ర్యాన్ స్కూల్ విద్యార్థి ప్రద్యుమ్న హత్య కేసు సంచలనం కల్గించింది. ఈ ఘటనపై పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. తొలుత ప్రద్యుమ్న హత్య కేసులో బస్ కండక్టర్ ను అనుమానించారు. కానీ, తర్వాత అసలు విషయం వెలుగు చూసింది.
అభం శుభం తెలియని చిన్నారిని హత్య చేయడంతో పెద్ద ఎత్తున ఆందోళనలు సాగాయి. హైకోర్టు కూడ ఈ ఘటనపై స్పందించింది. విద్యార్థుల తల్లిదండ్రులు కూడ ఆందోళనలు నిర్వహించారు.
ఇతరుల మాదిరిగానే కోర్టుకు ప్రద్యుమ్న నిందితుడు
ర్యాన్ స్కూల్ విద్యార్ది ప్రద్యుమ్న హత్య కేసులో నిందితుడిని తప్పనిసరిగా ఇతర ఖైదీల మాదిరిగానే కోర్టుకు తీసుకురావచ్చని స్పష్టం చేసింది.శుక్రవారం అతడిని కోర్టుకు తీసుకురావాలని కోర్టు బుదవారం నాడు ఆదేశాలు జారీ చేసింది. శుక్రవారం నాడు నిందితుడికి శిక్ష విధించే అవకాశం ఉందని సమాచారం.
నేరం రుజువైతే జైలుకే
శుక్రవారం నాడు ప్రద్యుమ్న కేసులో నిందితుడికి నేరం రుజువైతే శిక్ష ఖరారు కానుంది.శిక్ష కొరకు నిందితుడిని 21 ఏళ్లు నిండే వరకు బాల నేరస్తుల గృహంలో ఉంచి ఆ తర్వాత జైలుకు తరలించనున్నారు.
ప్రద్యుమ్న కుటుంబసభ్యుల వినతి మేరకు
సీబీఐ అరెస్టు చేసిన బాల నేరస్తుడిని మేజర్గానే పరిగణించి విచారించాలని ప్రద్యుమ్న కుంటుంబీకులు, వారి తరఫు న్యాయవాది డిమాండ్ చేశారు. ఉరిశిక్ష పడేలా పోరాడుతామని ఆ సమయంలో చెప్పగా వారి విజ్ఞప్తి మేరకు అతడిని యుక్తవయస్కుడిగానే గుర్తించి విచారణ చేపడతామని కోర్టు స్పష్టం చేసింది.
పరీక్ష వాయిదాకు హత్య
గుర్గావ్లోని ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఏడేళ్ల విద్యార్థి ప్రద్యుమ్న ఠాకూర్ను ఈ ఏడాది సెప్టెంబర్ 21న, హత్యకు గురయ్యారు.అదే స్కూల్లో 11వ తరగతి చదువుతున్న 16 ఏళ్ల విద్యార్థిని బాలనేరస్తుల చట్టం కింద సీబీఐ అరెస్టు చేసింది. చదువులో బాగా వెనుకబడిన నిందితుడు తల్లిదండ్రుల సమావేశాన్ని, పరీక్షను వాయిదా వేయించేందుకు ఈ హత్య చేసినట్లు గుర్తించాడు.