అమ్మాయి గ్యాంగ్ రేప్, బెయిల్ వచ్చింది, నడిరోడ్డులో నరికేసిన బాధితురాలి తండ్రి!
పూణే: బాలికను రేప్ చేసి అరెస్టు అయిన బాలుడు జైలుకు వెళ్లి బెయిల్ మీద బయటకు వచ్చాడు. తరువాత దర్జాగా ఇంటికి రావడంతో సహించలేని బాధితురాలి తండ్రి నిందితుడిని నడిరోడ్డు దారుణంగా నరికేసిన ఘటన మహారాష్ట్రలో జరిగింది.
పూణే సమీపంలోని నరసింహాపూర్ గ్రామంలో 17 ఏళ్ల బాలుడు నడిరోడ్డులో దారుణ హత్యకు గురైనాడని పోలీసులు చెప్పారు. నరసింహాపూర్ లో 16 ఏళ్ల బాలిక నివాసం ఉంటున్పది. అదే గ్రామంలో నివాసం ఉంటున్న 17 ఏళ్ల బాలుడు తన బంధువుతో కలిసి ఏప్రిల్ నెలలో బాలిక మీద గ్యాంగ్ రేప్ చేశారు.
బాధితురాలు ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు 17 ఏళ్ల బాలుడిని, అతని బంధువును అరెస్టు చేశారు. జైల్లో ఉన్న బాలుడికి బాలనేరస్తుల న్యాయస్థానం ఇటీవల జామీను ఇచ్చింది. బాలుడు ఇంటికి వస్తే చంపేస్తానని, తన కుమార్తెను పెళ్లి చేసుకునే వరకు గ్రామంలో అడుగుపెట్టకూడదని బాధితురాలి తండ్రి హెచ్చరించాడు.
ఆందోళన చెందిన బాలుడి కుటుంబ సభ్యులు అతన్ని పూణేలోని హాస్టల్ పెట్టారు. అయితే శుక్రవారం బాలుడు సొంత గ్రామంలోని ఇంటికి వెళ్లాడు. విషయం తెలుసుకున్న బాధితురాలి తండ్రి వేట కొడవలి తీసుకుని నేరుగా అతని ఇంటికి వెళ్లాడు.
బాలుడి మీద దాడి చేశాడు. ఇంటిలో ఉన్న బాలుడి తండ్రి అడ్డుకోవడంతో అతనికి గాయాలైనాయి. ఇంటి నుంచి పారిపోవడానికి ప్రయత్నించిన బాలుడిని వెంటాడిన బాధితురాలి తండ్రి గ్రామం నడిరోడ్డులో అడ్డగించి ఇష్టం వచ్చినట్లు నరికి గొంతు కోసి చంపేశాడు. బాలుడిని హత్య చేసిన బాలిక తండ్రిని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు.