జార్ఖండ్లో ఊహించని మలుపు.. 50కి పెరిగిన హేమంత్ బలం..
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడై ఒక్కరోజైనా గడవకముందే జార్ఖండ్ లో ఊహించని పరిణమం చోటుచేసుకుంది. మొత్తం 81 స్థానాలున్న అసెంబ్లీలో.. 47 సీట్లు గెల్చుకున్న జేఎంఎం కూటమి అధికారాన్ని కైవసం చేసుకుంది. హాఫ్ సెంచరీ సాధించలేకపోయారన్న లోటును పూడ్చుతూ.. ముగ్గురు ఎమ్మెల్యేలున్న జార్ఖండ్ వికాస్ మోర్చా(జేవీఎం) పార్టీ.. కూటమిలో చేరేందుకు సిద్ధమైంది.
మరాండీతో సోరెన్ భేటీ
కాబోయే సీఎం హేమంత్ సోరెన్ మంగళవారం సాయంత్రం జేవీఎం చీఫ్ బాబూలాల్ మరాండీ ఇంటికివెళ్లి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. జార్ఖండ్ కు తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన మరాండీ.. తర్వాతి కాలంలో బీజేపీ నుంచి విడిపోయి జేవీఎం స్థాపించారు. సొంత కుంపటి పెట్టుకున్నప్పటికీ బీజేపీతో దోస్తీ కొనసాగించారు. హేమంత్ తో భేటీ తర్వాత స్వరం మార్చుకున్నారు. ‘‘హేమంత్ సర్కారుకు జేవీఎం బేషరతుగా మద్దతు ఇస్తుంది. బేషరతుగానే ఎందుకంటే.. వాళ్లకు ఆల్రెడీ మెజార్టీ ఉంది కాబట్టి''అని మరాండీ చమత్కరించారు. సర్కారు ఏర్పాటుకాకముందే కూటమికి మద్దతు తెలిపినందుకు మరాండీకి హేమంత్ ధన్యవాదాలు చెప్పారు.
కూటమి నేతగా సోరెన్ ఎన్నిక.. గవర్నర్ తో భేటీకి..
మంగళవారం రాంచీలో సమావేశమైన జేఎంఎం ఎమ్మెల్యేలు తమ నేతగా హేమంత్ సోరెన్ ను ఎన్నుకున్నారు. ఆ తర్వాత జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ కూటమి నేతగానూ సోరెన్ పేరు ఖరారైంది. మూడు పార్టీల నేతలూ మంగళవారమే గవర్నర్ ను కలిసి.. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశమివ్వాల్సిందిగా కోరనున్నారు. సోరెన్ సీఎంగా ఎప్పుడు ప్రమాణం చేస్తారనేది ఇంకొద్దిసేపట్లో క్లారిటీ రానుంది.
బీజేపీ ఒంటరేనా?
జేవీఎం బాటలో ఆల్ జార్ఖండ్ స్టూడెంట్ యూనియన్ (ఏజేఎస్ యూ) పార్టీతోపాటు ఇద్దరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు కూడా హేమంత్ సోరెన్ కు మద్దతు ప్రకటిస్తారనే ప్రచారం జార్ఖండ్ లో జోరుగా సాగుతున్నది. ఏజేఎస్ యూకు ఇద్దరు ఎమ్మెల్యేలున్నారు. జార్ఖండ్ లో సీట్లు గెల్చుకున్న ఎన్సీపీ(1), కమ్యూనిస్ట్(1) పార్టీలూ సైద్ధాంతికంగా బీజేపీతో విరోధించేవి. అంటే, రాబోయే కాలంలో బీజేపీ ఒంటరయ్యే పరిస్థితి నెలకొంది.