బీజేపీలో జేవీఎం(పీ) విలీనం: డేట్ ఫిక్స్ చేసిన పార్టీ అధినేత బాబూలాల్ మరాండి
రాంచీ: తమ పార్టీ భారతీయ జనతా పార్టీలో విలీనం చేస్తున్నట్లు జార్ఖండ్ వికాస్ మోర్చా(ప్రజాతాంత్రిక్) అధినేత బాబూలాల్ బాబులాల్ మరాండి మంగళవారం ప్రకటించారు. ఇందుకు ఫిబ్రవరి 17న ముహూర్తం ఖరారు చేసినట్లు తెలిపారు.
తమ పార్టీని బీజేపీలో విలీనం చేసేందుకు కేంద్ర కమిటీ సమావేశం ఏకగ్రీవంగా అంగీకరించిందని బాబులాల్ మరాండి తెలిపారు. ఫిబ్రవరి 17న తారా మైదానంలో జరగనున్న విలీన కార్యక్రమానికి హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరవుతున్నారని ఈ జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి తెలిపారు.
పార్టీ ఎమ్మెల్యేలు ప్రదీప్ యాదవ్, బంధు తుర్కీల బహిష్కరణకు కేంద్ర కమిటీ ఆమోద ముద్ర వేసిందని మరాండీ తెలిపారు. ఢిల్లీలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను కలిసిన అనంతరం ప్రదీప్ యాదవ్ను పార్టీ నుంచి తొలగించినట్లు, ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా రద్దు చేసినట్లు తెలిపారు.
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటంతో యాదవ్, తుర్కీలపై వేటు వేసినట్లు బాబూలాల్ చెప్పారు. గత సంవత్సరం జరిగిన జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో జేవీఎం(పీ) మూడు స్థానాల్లో విజయం సాధించింది. యాదవ్, తుర్కీలతోపాటు పార్టీ అధినేత బాబూలాల్ మరాండి విజయం సాధించారు.
81 అసెంబ్లీ స్థానాలు కలిగిన జార్ఖండ్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో 30 స్థానాల్లో జేఎంఎం విజయం సాధించగా.. 25 స్థానాల్లో బీజేపీ(ఎన్డీఏ) గెలుపొందింది. యూపీఏ(కాంగ్రెస్)కు 16 స్థానాలు వచ్చాయి. ఈ క్రమంలో జేఎంఎం, కాంగ్రెస్ పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.