సీఎం బాధ్యతలు అప్పగిస్తే అందుకు సిద్ధంగా ఉన్నా: జ్యోతిరాదిత్య సిందియా
భోపాల్ : మధ్యప్రదేశ్లో కాంగ్రెస్, బీజేపీల మధ్య హోరాహోరీగా పోరు జరిగి చివరికి బీఎస్పీ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమైంది హస్తం పార్టీ. ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు అవుతారనే చర్చ తీవ్రతరం అయ్యింది. ఈ క్రమంలోనే జోతిరాదిత్య సింధియా పేరు తెరపైకి వచ్చింది. తనకు ముఖ్యమంత్రి బాధ్యతలను హైకమాండ్ అప్పగిస్తే తాను సమర్ధవంతంగా నిర్వహించగలుగుతాననే ఆత్మ విశ్వాసం వ్యక్తం చేశారు జోతిరాదిత్య సింధియా. ఆ పదవిని తాను ఎంతో గౌరవంగా భావిస్తానని చెప్పారు జోతిరాదిత్య సింధియా.
మధ్యప్రదేశ్ ప్రచారంలో కమల్నాథ్, దిగ్విజయ్ సింగ్, సింధియాల త్రయం హోరెత్తించింది. అంతేకాదు ముగ్గురూ కలిసి గవర్నర్ ఆనంది బెన్ పటేల్ను కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఆ తర్వాత బయటకు వచ్చి సంబురాల్లో పాల్గొన్నారు. "నేను ప్రజా సేవకుడిని, ఇప్పటి వరకు అలానే ఉన్నాను, ఇకపై కూడా ఉంటాను. అయితే అది మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా కావొచ్చు...కేంద్ర మంత్రిగా కావొచ్చు ఛీఫ్ విప్గా కావొచ్చు అది పార్టీ నిర్ణయిస్తుంది"అని సింధియా అన్నారు.
మధ్యప్రదేశ్లో హోరా హోరీ పోటీలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్కు 2 సీట్లు దూరంలో నిలిచింది. అయితే మాయావతి మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది కాంగ్రెస్. జోతిరాదిత్య సింధియా తను ప్రాతినిథ్యం వహిస్తున్న గ్వాలియర్-చంబల్ ప్రాంతంలో కాంగ్రెస్ 80శాతం సీట్లు గెలుచుకుందని చెబుతూనే తనకు ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని ఉందనే కాంక్ష చెప్పకనే చెప్పారు. 34 స్థానాల్లో కాంగ్రెస్ 23 స్థానాలను కాంగ్రెస్ ఈ ప్రాంతంలో గెలుచుకుంది. ఇక ఓవరాల్గా చూస్తే 25 శాతం ఓట్లును గ్వాలియర్ చంబల్ ప్రాంతం నుంచే కాంగ్రెస్కు పోలయ్యాయి. ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి ఖరారు విషయంలో ఎలాంటి వివాదం ఉండబోదని అది చాలా స్మూత్గా జరిగిపోతుందని రాహుల్ గాంధీ తనతో చెప్పినట్లు సిందియా తెలిపారు.