ఏ క్షణమైన సింధియా వర్గం రాజీనామా..? అమిత్ షాతో కలిసి మోడీతో భేటీ..
మధ్యప్రదేశ్ రాజకీయ సంక్షోభం పీక్ స్టేజీకి చేరింది. 17 మంది ఎమ్మెల్యేలతో క్యాంపు వేసిన సింధియా.. కాంగ్రెస్ పార్టీతో కలువబోమని తేల్చిచెప్పాడు. సీఎం కమల్నాథ్ మెట్టు దిగొచ్చి.. సింధియాకు రాజ్యసభ లేదంటే పీసీసీ చీఫ్ ఇచ్చినా ఫరావాలేదని చెప్పినా.. జ్యోతిరాధిత్య మాత్రం వెనకడుగు వేయడం లేదు. ఢిల్లీలో రాజకీయాలు చేస్తూ.. కాంగ్రెస్ పార్టీ గుండెల్లో గుబులు రేపుతున్నాడు.
రిసార్ట్లో ఎమ్మెల్యేలు..
హోంమంత్రి అమిత్ షాతో సమావేశమైన సింధియా భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. అక్కడినుంచి వారిద్దరూ ప్రధాని నరేంద్ర మోడీ వద్దకు వెళ్లారు. దీంతో మధ్యప్రదేశ్లో రాజకీయ సంక్షోభం తప్పదా అనే అనుమానాలు కలుగుతున్నాయి. బెంగళూరు రిసార్ట్లోనే 17 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో ఆరుగురు మంత్రులు అని తెలిసిన సంగతే. మోడీతో భేటీ తర్వాత.. సింధియా వర్గం ఏ క్షణమైనా రాజీనామాలు చేసే అవకాశం కనిపిస్తోంది. దీంతో కమల్ నాథ్ ప్రభుత్వం మైనార్టీలో పడిపోవడం ఖాయమనే చెప్పాలి. మరోవైపు మధ్యప్రదేశ్లో అస్థిరతకు చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ తన వంతు ప్రయత్నాలు మరింత ముమ్మరం చేసింది.
రాజ్యసభకు సింధియా..
ప్రధాని మోడీతో చర్చల తర్వాత.. సింధియాకు బీజేపీ రాజ్యసభకు పంపిస్తోందని తెలుస్తోంది. మధ్యప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సహకరించినందుకు గానూ.. సింధియాకు కేంద్ర మంత్రిపదవీ కూడా ఇస్తారని ప్రచారం జరుగుతోంది.
ఇదీ లెక్క..
మధ్యప్రదేశ్ అసెంబ్లీలో 230 సీట్లు ఉన్నాయి. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 114 సీట్లు గెలుచుకొని.. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. బీఎస్పీ ఇద్దరు సభ్యుల మద్దతుతో కాంగ్రెస్ పార్టీ బలం 116కి చేరుకుంది. దీంతో మధ్యప్రదేశ్లో కమల్ నాథ్ ప్రభుత్వం కొలువుదీరింది. పక్కలో బళ్లెంలా ఉన్న బీజేపీ 109 సీట్లు సాధించింది.
కాంగ్రెస్కు ప్లస్, బీజేపీకి మైనస్..
గత ఎన్నికల కంటే 57 సీట్లను బీజేపీ కోల్పోగా.. అవి కాంగ్రెస్ పార్టీ ప్లసయ్యింది. మధ్యప్రదేశ్లో ఎప్పుడూ అధికారం చేపడుదామా కాని కాచుకొని కూర్చొన్న బీజేపీకి.. జ్యోతిరాదిత్య సిందియా రూపంలో కలిసిచొచ్చింది. అసంతృప్త జ్వాల ఎగరేసిని సింధియా.. 17 మందితో క్యాంప్ వేయడంతో కమల్ నాథ్ ప్రభుత్వం కొనఊపిరితో కొట్టుమిట్టాడుతోంది.