బీజేపీలో చేరిక: రాజ్యసభకు జ్యోతిరాదిత్య సింధియా నామినేట్, మోడీ కేబినెట్లోకి ఖాయమే?
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బుధవారం భారతీయ జనతా పార్టీలో చేరిన జ్యోతిరాధిత్య సింధియాకు ఆ పార్టీ తగిన ప్రాధాన్యత ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే మధ్యప్రదేశ్ రాష్ట్రం నుంచి రాజ్యసభకు పంపే ఇద్దరు అభ్యర్థులలో ఒకరిగా జ్యోతిరాదిత్య సింధియా పేరును ఖరారు చేసింది.
Recommended Video
ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంలోకి తీసుకుంటారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో జ్యోతిరాదిత్య సింధియాకు రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించడం గమనార్హం. రాజ్యసభకు ఎన్నికైన తర్వాత నరేంద్ర మోడీ మంత్రివర్గంలోకి జ్యోతిరాదిత్య సింధియాను తీసుకుంటారని తెలుస్తోంది.
జ్యోతిరాదిత్య సింధియా వెంట మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని 22 ఎమ్మెల్యేలు ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే వారంతా రాజీనామా చేయడంతో మ్యాజిక్ ఫిగర్ పడిపోయింది. ఈ క్రమంలో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు పావులు కదుపుతోంది. ప్రస్తుతం అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి 92 స్థానాలు, బీజేపీకి 107 స్థానాలు ఉండటం గమనార్హం.
కాగా, నాలుగుసార్లు లోక్సభకు ఎన్నికైన జ్యోతిరాదిత్య సింధియా ప్రస్తుతం బీజేపీ నుంచి రాజ్యసభకు నామినేట్ అయ్యారు. బుధవారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో జ్యోతిరాదిత్య సింధియా ఆ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటే తాను ప్రజాసేవ చేయలేనని.. అందుకే తాను బీజేపీలో చేరుతున్నానని చెప్పారు సింధియా. అంతేగాక, ప్రధాని నరేంద్ర మోడీతో కలిసి పనిచేసేందుక ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.
Jyotiraditya Scindia: కేంద్రమంత్రి వయా రాజ్యసభ, ఎంపీలో బీజేపీకి లైన్క్లియర్! కాంగ్రెస్లో మరో కలవరం
ఇది ఇలావుంటే, కాంగ్రెస్ పార్టీకి చెందిన 22 మంది ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేయడంతో కమల్ నాథ్ ప్రభుత్వం కుప్పకూలే పరిస్థితి వచ్చింది. మొత్తం 230 స్థానాలున్న మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి 92, బీజేపీకి 107, స్వతంత్రులు 4, బీఎస్పీకి 2, ఎప్పీకి 1 స్థానం ఉంది. 24 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. దీంతో మ్యాజిక్ ఫిగర్ బీజేపీకి అనుకూలంగా మారింది. ఈ క్రమంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అయితే, తాము మెజార్టీని నిరూపించుకుంటామని కమల్ నాథ్ చెబుతున్నారు.