సీఎంగా కమల్నాథ్ పేరును ప్రతిపాదించిన జ్యోతిరాధిత్యా సింధియా, బాధ్యతనాదేనని శివరాజ్
భోపాల్: 2003 నుంచి మధ్యప్రదేశ్లో అధికారంలో ఉన్న శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలోని బీజేపీ నాలుగోసారి ఓడిపోయింది. మూడుసార్లు అధికారంలో ఉండి, నాలుగోసారి అధికారంలోకి రావడం కష్టమైన పనే. కానీ బీజేపీకి, శివరాజ్కు ఉన్న మంచి పేరు కారణంగా బీజేపీ గట్టిపోటీని ఇచ్చింది. ఈ నేపథ్యంలో శివరాజ్ సింగ్ ఢిల్లీకి వెళ్తారనే ప్రచారం సాగింది.
దీనిపై ఆయన స్పందించారు. తన ఆత్మ మధ్యప్రదేశ్లోనే ఉందని చెప్పారు. తద్వారా ఢిల్లీకి వెళ్తారనే ప్రచారానికి తెరదింపారు. మధ్యప్రదేశ్లో ఏ పార్టీకి సంపూర్ణ మెజార్టీ రాలేదు. బీజేపీకి 109, కాంగ్రెస్కు 114, బీఎస్పీకి రెండు సీట్లు వచ్చాయి. కాంగ్రెస్, బీఎస్పీ కలిస్తే సరిగ్గా మేజిక్ ఫిగర్ చేరుకుంటుంది. వీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు.
నా వైఫల్యమే
మధ్యప్రదేశ్లో బీజేపీ ఓడిపోవడం పూర్తిగా తన వైఫల్యమేనని శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. ఈ ఓటమి పైన ఎవరినైనా విమర్శించాలనుకుంటే అది శివరాజ్ సింగ్ చౌహాన్నే అని ఆయన తనను తాను చెప్పుకున్నారు. తాము ఓటమిని అంగీకరిస్తున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశానని, ఇప్పుడు తాను ఫ్రీ అయ్యానని చెప్పారు.
కమల్ నాథ్కు శుభాకాంక్షలు
శివరాజ్ సింగ్ చౌహాన్ బుధవారం తన రాజీనామా లేఖను గవర్నర్ ఆనందిబెన్ పటేల్కు అందించారు. రాష్ట్ర కాంగ్రెస్ నేత కమల్నాథ్కు చౌహాన్ శుభాకాంక్షలు తెలిపారు. వచ్చే ప్రభుత్వం కూడా మంచి చేస్తుందని ఆకాంక్షించారు. కాంగ్రెస్ ఇంకా ముఖ్యమంత్రి అభ్యర్థిని ఖరారు చేయాల్సి ఉంది. కాగా, మధ్యప్రదేశ్లో ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరుతూ కాంగ్రెస్ నేతలు బుధవారం మధ్యాహ్నం గవర్నర్ను కలిశారు. గవర్నర్ కూడా వారిని ఆహ్వానించారు.
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి
ఇదిలా ఉండగా, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా కమల్ నాథ్ను ముఖ్యమంత్రిగా ప్రతిపాదిస్తున్నారు. పార్టీ యువనేత జ్యోతిరాధిత్య సింధియా ఆయన పేరును ప్రపోజ్ చశారు. బుధవారం కాంగ్రెస్ పార్టీ లెజిస్లేటర్ భేటీ జరిగింది. ఈ భేటీ సింధియా సీనియర్ నేత కమల్ నాథ్ పేరును ప్రతిపాదించారని తెలుస్తోంది. మరోవైపు, సీఎల్పీలో ఎమ్మెల్యేలు ఎవరి పేరును తేల్చలేకపోయారని తెలుస్తోంది. అధిష్టానానికి అప్పగించారని సమాచారం. మొత్తానికి మధ్యప్రదేశ్ సీఎం అంశం ఉత్కంఠను రేపుతోంది.
బొటాబోటీ గెలుపు
230 స్థానాలున్న మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ 114, బీజేపీ 109, ఎస్పీ 1, బీఎస్పీ 2, ఇతరులు నాలుగు సీట్లలో గెలిచారు. మ్యాజిక్ ఫిగర్ 116 కాగా కాంగ్రెస్కు బీఎస్పీ మద్దతిచ్చింది. ఎస్పీ కూడా మద్దతు పలికింది. దీంతో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది.