శివరాజ్ సింగ్ను కలిసిన జ్యోతిరాదిత్య సింధియా: మధ్యప్రదేశ్లో రాజకీయ వేడి
భోపాల్: మధ్యప్రదేశ్లో బీఎస్పీ మద్దతుతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడింది. కమల్ నాథ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సీఎం పదవి కోసం జ్యోతిరాధిత్య సింధియా కూడా ప్రయత్నాలు చేశారు. కానీ ఫలించలేదు. ఇదిలా ఉండగా, సోమవారం రాత్రి బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ను సింధియా కలవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
సోమవారం రాత్రి శివరాజ్ సింగ్ ఇంటి వద్ద సింధియా మీడియాకు కనిపించారు. కేవలం మర్యాదపూర్వకంగానే కలుసుకున్నామని, ఎలాంటి రాజకీయాలు మాట్లాడుకోలేదని చెప్పారు. అయితే ఇరువురు నేతలు దాదాపు నలభై నిమిషాలు సమావేశమయ్యారు. దీంతో రాజకీయ వర్గాల్లో ఇది చర్చనీయాంశంగా మారింది.
పని నిమిత్తం భోపాల్కు
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపులో కమల్ నాథ్, జ్యోతిరాధిత్య సింధియా పాత్ర ఎంతో ఉంది. సింధియా భోపాల్లో ఉండటం లేదు. అయితే ఓ పని నిమిత్తం ఆయన భోపాల్ వచ్చారు. అనంతరం రాత్రి శివరాజ్ను కలిశారు. భేటీ అనంతరం చౌహాన్ కారు వద్దకు వచ్చి సింధియాకు వీడ్కోలు పలికారు. దీంతో మధ్యప్రదేశ్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
కమల్ నాథ్ లేని సమయంలో భేటీ
తాము మర్యాదపూర్వకంగానే కలిశామని చౌహన్, సింధియా చెప్పినప్పటికీ రాజకీయ నేపథ్యం ఉండి ఉంటుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సీఎం కమల్నాథ్ మధ్యప్రదేశ్లో లేని సమయంలో సింధియా.. చౌహన్ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు వీరి భేటీపై కాంగ్రెస్ స్పందించింది. అభివృద్ధి కార్యక్రమాల్లో శివరాజ్ సింగ్ చౌహన్ మద్దతు కోరేందుకే సింధియా ఆయనను కలిశారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనక్ అగర్వాల్ చెప్పారు.
సింధియా అసంతృప్తితో ఉన్నారా?
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపొందిన తర్వాత ముఖ్యమంత్రి ఎంపికపై కసరత్తు బాగానే జరిగింది. ముఖ్యమంత్రి రేసులో సింధియా, కమల్నాథ్ చివరి వరకు పోటీపడ్డారు. ఎన్నో చర్చల అనంతరం సీనియర్ కమల్నాథ్ వైపే పార్టీ మొగ్గు చూపింది. దీంతో సింధియా పార్టీపై కాస్త అసంతృప్తిగా ఉన్నట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి. తాజాగా ఆయన చౌహన్తో భేటీ అవడం ఆసక్తిని కలిగించింది.