Jyotiraditya Scindia: కేంద్రమంత్రి వయా రాజ్యసభ, ఎంపీలో బీజేపీకి లైన్క్లియర్! కాంగ్రెస్లో మరో కలవరం
న్యూఢిల్లీ/భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన బీజేపీలో చేరిక దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఆయనకు మద్దతుగా ఉన్న 22 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు.
Recommended Video
12న ముహూర్తం ఖరారు
సోమవారం నుంచీ ఢిల్లీలోనే మకాం వేసిన జ్యోతిరాదిత్య సింధియా మంగళవారం బీజేపీ పెద్దలను కలిశారు. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రి అమిత్ షాలను సింధియా కలిశారు. ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో జ్యోతిరాదిత్య సింధియాను బీజేపీలోకి తీసుకునేందుకు పెద్దలు అంగీకరించినట్లు తెలుస్తోంది. కాషాయ పార్టీలో మార్చి 12న సింధియా చేరనున్నట్లు సమాచారం.
కేంద్రమంత్రి వయా రాజ్యసభ
కాగా, రాజ్యసభ స్థానాలే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీకి తాజా పరిణామం కలిసివచ్చే అంశంగా మారనుంది. జ్యోతిరాదిత్య సిందియాను మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు పంపాలని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఆయనకు నరేంద్ర మోడీ మంత్రివర్గంలోకి తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అంతా అనుకున్నట్లుగా జరిగితే జ్యోతిరాదిత్య సింధియా కేంద్రమంత్రి కావడం ఖాయంగా కనిపిస్తోంది.
బీజేపీకి లైన్ క్లియర్..
ఇది ఇలావుంటే, కాంగ్రెస్ పార్టీకి చెందిన 22 మంది ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేయడంతో కమల్ నాథ్ ప్రభుత్వం కుప్పకూలే పరిస్థితి వచ్చింది. మొత్తం 230 స్థానాలున్న మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి 92, బీజేపీకి 107, స్వతంత్రులు 4, బీఎస్పీకి 2, ఎప్పీకి 1 స్థానం ఉంది. 24 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. దీంతో మ్యాజిక్ ఫిగర్ బీజేపీకి అనుకూలంగా మారింది. ఈ క్రమంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అయితే, తాము మెజార్టీని నిరూపించుకుంటామని కమల్ నాథ్ చెబుతున్నారు.
కాంగ్రెస్ పార్టీలో మరో కలవరం..
ఇది ఇలావుండగా, కమల్ నాథ్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన సమావేశానికి 92 మందిలో కేవలం 40 మంది ఎమ్మెల్యేలు మాత్రమే హాజరుకావడం కాంగ్రెస్ పార్టీని మరింత కలవరపరుస్తోంది. మరో 52 మంది ఈ సమావేశానికి డుమ్మా కొట్టడం గమనార్హం. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీని వీడిన సీనియర్ నేతలు.. కాంగ్రెస్ పార్టీని వీడేవారి సంఖ్య మరింత పెరుగుతుందని చెబుతుండటం గమనార్హం.