దక్షిణాదిన బాంబు పేలుళ్ల సమాచారం ఉత్తుత్తిదే: పోలీసుల అదుపులో మాజీ సైనిక ఉద్యోగి: కారణం ఏమిటంటే..!
బెంగళూరు: భారీ ఎత్తున ఉగ్రవాదుల దాడులు చోటు చేసుకోవచ్చంటూ సమాచారం ఇచ్చి, దక్షిణాది రాష్ట్రాల ప్రభుత్వ, పోలీసు యంత్రాగాన్ని ఉరుకులు, పరుగులు పెట్టించిన వార్తలు నిజం కాదని, అదంతా కట్టుకథ అని తేలింది. బెంగళూరు కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసిన వ్యక్తి మాజీ సైనిక ఉద్యోగి అని స్పష్టమైంది. బెంగళూరు పోలీసులు అతణ్ని అరెస్టు చేశారు. కేసు నమోదు చేశారు. ఏ ఉద్దేశంతో బాంబు పేలుళ్లకు సంబంధించిన తప్పుడు సమాచారాన్ని ఇచ్చాడనే విషయం ఆరా తీస్తున్నారు.
బెంగళూరు-తమిళనాడు సరిహద్దుల్లోని పారిశ్రామిక పట్టణం హోసూరు నుంచి మాట్లాడుతున్నానంటూ ఓ లారీ డ్రైవర్ శుక్రవారం సాయంత్రం 5:35 నిమిషాల సమయంలోో బెంగళూరు కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసిన విషయం తెలిసిందే. తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పుదుచ్చేరి, గోవా, మహారాష్ట్రల్లో ఉగ్రవాదులు దాడులు చేయొచ్చంటూ తనకు తెలిసిందని పోలీసులకు వెల్లడించారు. ప్రధానంగా- రైళ్లల్లో బాంబులు పేలవచ్చని తెలిపాడు. శ్రీలంక తరహాలో ప్రార్థనా స్థలాలు, పర్యాటక కేంద్రాలపై కాకుండా.. ప్రయాణ సాధనాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చోటు చేసుకోవచ్చని అతను వెల్లడించాడు. తమిళనాడులోని రామనాథపురంలో 19 మంది ఉగ్రవాదులు తిష్ట వేసినట్లు తనకు తెలిసిందంటూ ఫోన్ చేశాడు.
మాజీ సైనిక ఉద్యోగిగా గుర్తింపు..
ఒకే ఒక్క ఫోన్ కాల్ తో పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేసిన ఆ వ్యక్తి పేరు స్వామి సుందరమూర్తి. వయస్సు 65 సంవత్సరాలు. బెంగళూరు శివార్లలోని ఆవలహళ్లిలో మునివెంకటప్ప లేఅవుట్ లో నివాసం ఉంటున్నాడు. అతను మాజీ సైనిక ఉద్యోగి. సైన్యం నుంచి పదవీ విరమణ చేసిన అనంతరం లారీ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. శుక్రవారం సాయంత్రం నుంచి తమిళనాడులోని హోసూరు నుంచి బెంగళూరు కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసి, ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం ఉన్నట్లు సమాచారం ఇచ్చాడు. దీనితో అప్రమత్తమైన పోలీసులు ఒకవంక పెద్ద ఎత్తున తనిఖీలు, సోదాలను నిర్వహించారు.
అప్రమత్తం చేయడానికేనట..
మరోవంక సమాచారం ఇచ్చిన సుందరమూర్తి గురించి ఆరా తీయడం మొదలు పెట్టారు. అతను ఫోన్ చేసిన 636109352 నంబర్ ఆధారంగా కూపీ లాగారు. చివరికి అతను ఆవలహళ్లిలోని మునివెంకటప్ప లేఅవుట్ లో నివసిస్తున్నాడని తేలింది. వెంటనే అతణ్ని అదుపులోకి తీసుకుని విచారించగా.. అదంతా కట్టుకథ అని తేలినట్లు సమాచారం. పోలీసు యంత్రాంగం మొత్తాన్ని అప్రమత్తం చేయడానికే తాను ఈ ఫోన్ చేశానని, సుందరమూర్తి పోలీసుల దర్యాప్తులో అంగీకరించినట్లు తెలుస్తోంది. అతని కుటుంబ నేపథ్యాన్ని పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇదివరకు అతని మీద క్రిమినల్ కేసులేమైనా నమోదై ఉన్నాయా అనే అంశాన్ని పరిశీలిస్తున్నారు.
పోలీసుల విస్తృత తనిఖీలు..
ఇదిలావుండగా..సుందరమూర్తి నుంచి ఫోన్ కాల్ అందుకున్న మరుక్షణమే బెంగళూరు పోలీసులు అప్రమత్తం అయ్యారు. రైళ్లను పేల్చేయవచ్చంటూ అతను సమాచారం ఇచ్చిన నేపథ్యంలో.. రైల్వేస్టేషన్లలో తనిఖీలు నిర్వహించారు. యలహంక, కృష్ణరాజపురం, యశ్వంతపుర, కంటోన్మెంట్, క్రాంతివీర సంగోళి రాయణ్ణ బెంగళూరు స్టేషన్లలో విస్తృతంగా సోదాలు చేపట్టారు. డాగ్ స్క్వాడ్ ను రంగంలోకి దించారు. అణువణువూ గాలించారు. దీనితో పాటు ప్రధాన కూడళ్లలో వాహనాలను తనిఖీ చేశారు. అనుమానించదగ్గ వస్తువులు ఏవీ పోలీసుల కంటికి చిక్కలేదు. దీనితో వారు ఊపిరి పీల్చుకున్నారు.