శ్రీరాముడి అవతారంలో రాహుల్..నెట్టింట్లో ఫోటో వైరల్
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రతిరోజు ఓ కొత్త లుక్కుతో కనిపిస్తున్నారు. అయితే స్వతహాగా రాహుల్ గాంధీ కాదు.. కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానంతో ఆయన ఫ్లెక్సీని ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి ఫ్లెక్సీలో రాహుల్ గాంధీ ఫోటో కొత్త లుక్తో కనిపిస్తోంది. దీంతో సోషల్ మీడియాలో రాహుల్ ఫోటోలు తెగ వైరల్ అయిపోతున్నాయి. నెటిజెన్లు ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఆఫ్ ది కంట్రీ గురించి తెగ చర్చించుకుంటున్నారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇంటర్నెట్లో హాట్ టాపిక్ అయ్యారు. ఒక బ్లూ టీషర్ట్ ధరించి గోవాను చుట్టేస్తున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఎప్పుడూ తెల్ల జుబ్బాతో కనిపించే రాహుల్ నీలం రంగు టీషర్టులో కనపడే సరికి నెటిజెన్లు బాగా చర్చించుకున్నారు. ఇక గోవాలో రాహుల్ రియల్ లుక్ ఇదైతే... పాట్నాలో దర్శనమిచ్చిన పోస్టర్లో మాత్రం శ్రీరాముని అవతారంలో కనిపించారు.
ఫిబ్రవరి 3న జనఆకర్ష ర్యాలీకి పాట్నాలోని గాంధీ మైదాన్ వేదిక సిద్ధమవుతోంది. ఈ కార్యక్రమానికి రాహుల్ గాంధీ హాజరుకానున్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలు ఏర్పాటు చేసిన పోస్టర్లు ఆసక్తికరంగా ఉన్నాయి. రాహుల్ గాంధీ బాణం సంధిస్తున్నట్లుగా ఉంది. అంతేకాదు బీజేపీని విమర్శిస్తే పోస్టర్ మధ్యలో కొన్ని పదాలు కూడా కనిపిస్తున్నాయి. "వారు (బీజేపీ) రామజపం చేస్తూనే ఉంటారు... కానీ మీరే (రాహుల్ గాంధీ) శ్రీరాముడిగా మాకు కనిపిస్తున్నారు" అంటూ పదాలు పోస్టర్పై ఉన్నాయి.
2019 సార్వత్రిక ఎన్నికలకు మరో మూడు నెలల సమయం మాత్రమే ఉండటంతో పార్టీలు సభలు సమావేశాలకు సిద్దం అవుతున్నాయి. ఇందులో భాగంగానే అన్ని పార్టీల అగ్రనేతలు ఆయా రాష్ట్రాల్లో పర్యటిస్తూ ప్రజలతో మమేకమవుతున్నారు. ఇప్పటికే అమిత్ షా హిమాచల్ ప్రదేశ్లో బూతుస్థాయి కార్యకర్తలతో సమావేశమై కాంగ్రెస్పై నిప్పులు చెరుగగా... రాయ్పూర్ సభలో రాహుల్ గాంధీ తాము అధికారంలోకి వస్తే పేదలకు కనీస వేతనం ఇస్తామంటూ హామీ ఇచ్చారు.