దేశానికి సత్యార్థి 'నోబెల్': పక్కన కూర్చునే అర్హత లేదని అమితాబ్
న్యూఢిల్లీ: తాను అందుకున్న ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతిని దేశానికి అంకితం ఇవ్వాలని కైలాష్ సత్యార్థి నిర్ణయించుకున్నారు. సత్యార్థి బుధవారం నాడు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసి తన నోబెల్ బహుమతిని ఆయనకు ఇవ్వడం ద్వారా దేశానికి అంకితం ఇవ్వనున్నారు.
రాష్ట్రపతి భవన్లో ఉంటున్న రాష్ట్రపతి ప్రణబ్ను ఈ రోజు సత్యార్థి కలుస్తారు. ఎనిమిది కేరట్ల గ్రీన్ గోల్డ్ ప్లేటెడ్, 24 కేరట్ గోల్డ్తో ఉన్న 175 గ్రాముల నోబెల్ బహుమతిని రాష్ట్రపతికి అందచేయనున్నారు. దీనిని దేశానికి అంకితం చేస్తానని సత్యార్థి చెప్పారు.
సత్యార్థి పాకిస్తాన్కు చెందిన సాహస బాలిక మలాలా యూసఫ్జాయ్తో కలిపి నోబెల్ బహుమతిని డిసెంబర్ 10వ తేదీన తీసుకున్న విషయం తెలిసిందే. కాగా, బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ మంగళవారం నాడు సత్యార్థిని కలిశారు.
ముంబైలో నిర్వహించిన బ్యాంకర్ల సమావేశానికి ముఖ్య అతిథిలుగా సత్యార్థి, అమితాబ్ వచ్చారు. ఈ సందర్భంగా వారు కలుసుకున్నారు. అమితాబ్ మాట్లాడుతూ.. కైలాష్ సత్యార్థి వంటి గొప్ప వ్యక్తితో వేదిక పంచుకోవడం తనకు ఎంతో గర్వంగా ఉందని, ఆయనలాంటి వ్యక్తి పక్కన కూర్చునేందుకు తనకు అర్హత లేదన్నారు. సత్యార్థి చైల్డ్ లేబర్కు వ్యతిరేకంగా సేవలు అందిస్తుండటాన్ని అమితాబ్ ప్రశంసించారు.