మోడీ-యోగీలకు యూపీలో మరో పరీక్ష: కైరానా ఉప ఎన్నికల్లో గట్టి సవాల్, మరో 3చోట్ల
లక్నో: 2019 ఎన్నికలకు ముందు బీజేపీ మరో పరీక్షను ఎదుర్కోనుంది. సోమవారం మహారాష్ట్రలో రెండు, యూపీల ఒకటి, నాగాలాండ్లో ఒకటి.. మొత్తం నాలుగు లోకసభ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. నాలుగేళ్లుగా వరుస విజయాలు సాధించినా, కర్ణాటకలో అత్యధిక స్థానాలు సాధించినా, కన్నడనాట జేడీఎస్ - కాంగ్రెస్ కూటమి ఏర్పాటు, విపక్షాలు ఏకవుతున్న సమయంలో ఈ ఉప ఎన్నికలు బీజేపీకి కీలకంగా మారాయి. అంతేకాదు, యూపీలో ఇటీవల ఉప ఎన్నికల్లో రెండు స్థానాలు కోల్పోయింది.
బీజేపీ సిట్టింగ్ ఎంపీ హుకుం సింగ్ మరణంతో కైరానాలో ఉపఎన్నిక అనివార్యమైంది. ఆయన కుమార్తె మృగాంక సింగ్కు బీజేపీ టిక్కెట్ ఇచ్చింది. విపక్షాలు కలిసి ఉమ్మడి ఆర్ఎల్డీకి చెందిన తబస్సుం హసన్ను పోటీకి దింపాయి. లోక్దళ్ అభ్యర్థి కన్వర్ హసన్ పోటీ నుంచి తప్పుకొని ఆర్ఎల్డీలో చేరారు. ఆయన తబస్సుంకు బావ. కులం, మతాల ప్రభావం, వివిధ వర్గాల మధ్య ఘర్షణలు ఇక్కడ సర్వసాధారణం.
2014 ఎన్నికల్లో గుజ్జర్ సామాజిక వర్గానికి చెందిన హుకుం సింగ్ 5,65,909 ఓట్లు సాధించగా, ప్రత్యర్థి సమాజ్వాదీ పార్టీకి చెందిన నషీద్ హసన్ 3,29,081 ఓట్లు వచ్చాయి. ప్రస్తుతం నషీద్ తల్లి తబస్సుం ఆర్ఎల్డీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. 2017 ఎన్నికల్లో నషీద్ ఎస్పీ అభ్యర్థిగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అప్పట్లో ఆయన చేతిలో ఓడిన మృగాంక ఇప్పుడు బీజేపీ అభ్యర్థిగా తలపడుతున్నారు.
ఈ నియోజకవర్గంలో 5.26 లక్షల ముస్లిం ఓటర్లు ఉండగా, మారిన పరిస్థితుల నేపథ్యంలో వారంతా తమకు మద్దతు ఇస్తారని విపక్షాలు అంచనా వేస్తున్నాయి. బీఎస్పీ నాయకురాలు మాయావతి ప్రభావాన్ని అంచనా వేయలేక గతంలో ఫూల్పూర్, గోరఖ్పూర్లో జరిగిన ఉప ఎన్నికల్లో ఓడిపోయామని, ఇప్పుడు ఆ తప్పు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని బీజేపీ చెబుతోంది. ఇక్కడ 2.25 లక్షల మంది దళిత ఓటర్లు ఉన్నారు. ముస్లింల తర్వాత వారి జనాభాయే ఎక్కువ. దళితుల మద్దతు పొందడానికి బీజేపీ ఇక్కడ విహెచ్పీ సాయంతో హిందుత్వ కార్డును ఉపయోగిస్తోంది. ముస్లీంలను మూకుమ్మడిగా తమవైపు తిప్పుకునేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్నాయి.
మహారాష్ట్రలోని పాల్ఘర్లో బీజేపీ సిట్టింగ్ ఎంపీ చింతామణ్ వాంగా మృతి కారణంగా ఉప ఎన్నిక జరుగుతోంది. బీజేపీ రాజేంద్ర గవిట్కు టిక్కెట్ ఇస్తే, శివసేన తరఫున శ్రీనివాస్ బరిలో నిలిచారు. కాంగ్రెస్, ఎన్సీపీలు కలిసి పోటీ చేస్తున్నాయి. బాంద్రా - గోండియా నియోజకవర్గం ఎంపీ కాంగ్రెస్లో చేరారు. దీంతో ఇక్కడా ఉప ఎన్నిక జరుగుతోంది. కాంగ్రెస్, ఎన్సీపీ కలిసి పోటీ చేస్తున్నాయి. మధుకర్ కుక్డే బరిలో నిలిచారు.
మరోవైపు నాగాలాండ్ ఎంపీ నైపు రియో బీజేపీ మద్దతుతో సీఎం అయ్యారు. దీంతో ఉప ఎన్నిక జరుగుతోంది. బీజేపీ, పీపుల్స్ డెమోక్రాటిక్, మిత్రపక్షాల తరఫున టొఖెహో యప్తోమి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ మద్దతుతో నాగాలాండ్ పీపుల్స్ ఫ్రంట్ అభ్యర్థఇగా జమీర్ రంగంలో ఉన్నారు.