మేజిక్ ఫిగర్ 272: ఈ ఫలితాలు మోడీకి చాలా కీలకం, లోకసభలో ఇదీ బీజేపీ లెక్క, కైరానాపై ఉత్కంఠ
న్యూఢిల్లీ: నాలుగు లోకసభ ఉప ఎన్నికల ఫలితాలు బీజేపీకి ఎంతో కీలకం. 2019 ఎన్నికల కోసం ఉప ఎన్నికల్లో గెలుపు ఉత్సాహం తీసుకువస్తుంది. ఏ పార్టీ గెలిచినా సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆ పార్టీకి బలమే. కానీ బీజేపీకి 2019తో పాటు ఇప్పటికిప్పుడు కూడా ఈ ఉప ఎన్నికల ఫలితాలు అవసరం.
Recommended Video
ప్రస్తుతం బీజేపీ బలం స్పీకర్ మినహా 272. లోకసభలో మెజార్టీకి కావాల్సిన సీట్లు ఉన్నాయి. ఒక్కటి కూడా ఎక్కువ లేదు. ఇది సరిగ్గా సాధారణ ఆధిక్యానికి అవసరమయిన బలం. ఇందులో ఒక్క స్థానం తగ్గినా విశ్వాస పరీక్షకు వెళ్లాల్సి వస్తే ఎన్డీయే భాగస్వామ్య పక్షాలపై ఆధారపడక తప్పదు.
ఈ 272 కూడా పార్టీలోని అసంతృప్తులు, ఇతరులు ఉన్నారు. ఒక ఎంపీ కీర్తి ఆజాద్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. మరొక ఎంపీ శతృఘ్న సిన్హా ఎప్పటి నుంచో తిరుగుబాటు గళం వినిపిస్తున్నారు. దీంతో బీజేపీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో కనీసం రెండు సిట్టింగ్ స్థానాలైనా గెల్చుకోవడం అవసరంగా ఉంది.
బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుస్తున్నప్పటికీ చాలా లోకసభ ఉపఎన్నికల్లో ఓటమి చవిచూస్తోంది. విపక్ష పార్టీలు ఒక్కటిగా పోటీ చేయడానికి తోడు ప్రభుత్వ వ్యతిరేక ఓటుతో లేదా వ్యూహాత్మక భాగస్వామ్యాలతో ఉప ఎన్నికల్లో గెలుస్తున్నాయి.
నాలుగు లోకసభ స్థానాల్లో ఈ నెల 28న ఉప ఎన్నికలు జరిగాయి. మహారాష్ట్రలోని బాంద్రా - గోండియా, పాల్ఘర్, నాగాలాండ్లోని నాగాలాండ్, ఉత్తర ప్రదేశ్లోని కైరానాలో ఉప ఎన్నిక జరిగింది. నాగాలాండ్ను పక్కన పెడితే.. బాంద్రా - గోండియాలో బీజేపీ - ఎన్సీపీ, కైరానాలో ఆర్ఎల్డీ - బీజేపీ నువ్వా నేనా అన్నట్లుగా ఉంది. పాల్ఘర్లోను శివసేన గట్టి పోటీ ఇస్తోంది.