కరుణానిధిలాంటి వ్యక్తిని ఇక మనం చూడలేం: సోనియా భావోద్వేగపు లేఖ
చెన్నై: కరుణానిధి మృతి నేపథ్యంలో ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు, యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్కు భావోద్వేద్వేగపూరిత లేఖ రాశారు. కరుణానిధి తనకు తండ్రిలాంటి వారని, ఆయన లాంటి వారి మళ్లీ పుట్టరని ఆ లేఖలో పేర్కొన్నారు.
ఎవరీ కరుణానిధి? ఇదీ రాజకీయ నేపథ్యం-ఎన్నో రికార్డ్లు: కీలక అంశాలు
కరుణానిధి మరణం తనను ఎంతగానో బాధించిందని పేర్కొన్నారు. కలైంజ్ఞర్ లాంటి మరో వ్యక్తిని మనం ఎప్పటికీ చూడలేమన్నారు. దేశం ఒక మహానేతను కోల్పోయిందన్నారు. రాజకీయ రంగంలో కరుణానిధి శిఖరం లాంటి వారని చెప్పారు. తమిళనాడుకే కాక దేశానికి కూడా ఆయన ఎంతో సేవ చేశారన్నారు.
తమిళనాడుకు ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చారు
సమాజంలో మానవత్వం కోసం, అభివృద్ధి కోసం, సమానత్వం కోసం, తమిళనాడు ఉన్నతి కోసం, పేదల కోసం ఎంతో కృషి చేశారని సోనియా గాంధీ పేర్కొన్నారు. తమిళనాడు కళలు, సంస్కృతికి ప్రపంచవ్యాప్తంగా ఆయన గుర్తింపు తెచ్చారని చెప్పారు. దశాబ్దాల పాటు ఆయన చేసిన సేవలు చిరకాలం నిలిచిపోతాయన్నారు.
మీ తండ్రి ఆశయాలు మీరు ముందుకు తీసుకెళ్తారని
మీ తండ్రి కరుణానిధి ఆశయాలను మీరు ముందుకు తీసుకు వెళ్తారని తాను బలంగా విశ్వసిస్తున్నానని స్టాలిన్కు రాసిన లేఖలో సోనియా గాంధీ పేర్కొన్నారు. కరుణానిధి మరణం వ్యక్తిగతంగా తనకు చాలా బాధాకరం అన్నారు. తన పట్ల ఆయన ఎంతో అభిమానాన్ని చూపించారన్నారు. తనకు కూడా ఆయన తండ్రిలాంటి వారు అన్నారు. నా మనస్సు, ప్రార్థనలు అన్నీ మీ కుటుంబంతో ఉన్నాయి అన్నారు.
నాతో పాటు అందరికీ గురువు
కరుణానిధి మృతి పట్ల ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ అధినేత కమల్ హాసన్ సంతాపం వ్యక్తం చేశారు. తన జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తిని కోల్పోయానని, తన సినీ, రాజకీయ గురువైన వ్యక్తి దూరమయ్యారని భావోద్వేగంతో చెప్పారు. తమిళ సినీ పరిశ్రమలో తనతో పాటు ఏ నటుడికైనా కరుణానిధి, శివాజీ గణేశన్, కన్నదాసన్లు గురువులు అన్నారు. ఈ ముగ్గురు గురువులు ఇప్పుడు తనకు దూరమయ్యారన్నారు. కరుణానిధి నుంచి నటన పరంగా ఓనమాలు నేర్చుకున్నానని, ఆయన సినీ రచయిత కాకముందు నుంచే తనకు తెలుసునని చెప్పారు.
పార్టీ పెడతానంటే సంతోషించారు
కరుణానిధి రాజకీయాలను ఎంతో లోతుగా అధ్యయనం చేశారని కమల్ చెప్పారు. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే అన్నారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు తన ముందు లేరన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని చెప్పారు. తన రాజకీయ జీవితానికి ఊపిరి ఇచ్చింది ఆయనే అన్నారు. తాను రాజకీయ పార్టీ స్థాపిస్తానని ఆయనకు చెప్పగానే ఎంతో సంతోషించి ఒక తండ్రిలాగా తన వెన్నుతట్టారన్నారు. 70 ఏళ్లకు పైగా రాజకీయ అనుభవం ఉన్న ఆయన వద్ద విలువైన సలహాలు తీసుకున్నానని, అటువంటి రాజకీయ నేతను ఇప్పటివరకూ ఎక్కడా చూడలేదన్నారు. చేసే పని చిత్తశుద్ధితో చేస్తే గుర్తింపు దానంతట అదే వస్తుందని తనకు ఎప్పుడూ చెప్పేవారన్నారు. ఆ లక్షణం తనకు నచ్చిందన్నారు.