కాలాపాని నేపాల్ భూభాగం..సైన్యంను ఉపసంహరించుకోండి: నేపాల్ ప్రధాని ఓలీ
నేపాల్, భారత్, టిబెట్లకు జంక్షన్గా ఉన్న కాలాపాని ప్రాంతం తమదేనంటూ నేపాల్ ప్రధాని కేపీ ఓలీ పునరుద్ఘాటించారు. కొద్దిరోజుల క్రితం భారత హోంశాఖ కార్యాలయం విడుదల చేసిన కొత్త మ్యాప్లో కాలాపానిని భారత భూభాగంలో చేర్చడంపై నేపాల్ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం తెలిపింది. ఈ క్రమంలోనే కాలాపాని వద్ద మోహరించి ఉన్న భారత సైన్యం వెంటనే అక్కడి నుంచి వెనక్కు వెళ్లిపోవాలంటూ నేపాల్ ప్రధాని కేపీ ఓలీ డిమాండ్ చేశారు. అంతకుముందు కేంద్ర హోంశాఖ విడుదల చేసిన కొత్త భారత మ్యాపులతో వివాదం రాజుకుంది. అయితే నేపాల్ ప్రభుత్వ అధికారులు దీనిపై స్పందించారు కానీ తొలిసారిగా నేపాల్ ప్రధాని స్పందించారు.
ఒక్క ఇంచి భూమి కూడా వదులుకోం: నేపాల్ ప్రధాని ఓలీ
పశ్చిమ నేపాల్కు చివరన కాలాపాని ప్రాంతం ఉంటుంది. నేపాల్ అభ్యతరం తెలిపినప్పటికీ భారత ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనరాలేదు. మ్యాపులో ఉన్నది ఖచ్చితత్వంతో కూడిన భారత సౌర్వభౌమ భూభాగమని అధికారులు తెలిపారు. అప్పుడు ఎలా ఉన్నిందో కొత్త మ్యాపులో కూడా నేపాల్ సరిహద్దు అలానే ఉందని స్పష్టం చేసింది. నేపాల్ యువసంఘం ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ప్రసంగించిన ప్రధాని ఓలీ.. నేపాల్ భూభాగం ఒక్క ఇంచికూడా వేరే దేశంకు వెళ్లేందుకు వీల్లేదన్నారు. వెంటనే భారత్ తన సైన్యాన్ని కాలాపాని ప్రాంతం నుంచి వెనక్కు రప్పించాలని కోరారు.
నేపాల్కు మారో మ్యాప్ లేదు
నేపాల్ మరో మ్యాప్తో వచ్చిందన్న వాదనలను కేపీ ఓలీ కొట్టిపారేశారు. అందులో వాస్తవం లేదన్నారు. వివాదాస్పదంగా ఉన్న ప్రాంతాలతో కొత్త మ్యాప్ను నేపాల్ ముద్రించిందన్న దాంట్లో వాస్తవం లేదన్నారు. తమ భూభాగమైన కాలాపాని నుంచి భారత్ తన సైన్యంను ఉపసంహరించుకున్న తర్వాతే చర్చలు జరుపుతామని ఆదేశ ప్రధాని కేపీ ఓలీ అన్నారు. ఇండియా విడుదల చేసిన కొత్త మ్యాపులపై నేపాల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరిగాయి. ఇటు అధికార పక్షం అటు విపక్షాలు రెండూ నిరసనలు తెలిపాయి. దీంతో భారత్తో వెంటనే చర్చలు జరపాలంటూ ఆదేవ మాజీ విదేశాంగ మంత్రులు ప్రధానిని కోరారు
పాత సరిహద్దులే కొత్త మ్యాపులో ఉన్నాయి: భారత్
జమ్మూకశ్మీర్ మరియు లడఖ్లు రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించిన తర్వాత భారత మ్యాపును రీడిజైన్ చేసింది కేంద్ర హోంశాఖ. పాక్ ఆక్రమిత కశ్మీర్ను జమ్మూకశ్మీర్లోకి చేర్చగా.. గిల్గిట్-బాల్టిస్తాన్ను లడాఖ్లో చేర్చారు. కాలాపాని ప్రాంతం నేపాల్ భూభాగంకే చెందుతుందని నేపాల్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి చెప్పారు. దీనికి సమాధానంగా కొత్తగా గీసిన మ్యాప్లో నేపాల్ భారత్ సరిహద్దులను మార్చలేదని స్పష్టం చేసింది భారత్. నేపాల్ ప్రభుత్వం అనుమానం లేవనెత్తింది కాబట్టి చర్చల ద్వారా పరిష్కరించుకుంటామని వెల్లడించింది.