కొత్త సమస్య: కాలాపాని భూభాగం నేపాల్కు చెందుతుందన్న ఆ దేశ ప్రభుత్వం
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన తర్వాత కేంద్ర హోంశాఖ భారత దేశపు కొత్త మ్యాప్ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇందులో కాలాపాని భారత భూభాగంలో చేర్చడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది నేపాల్. భారత్ కొత్తగా శనివారం విడుదల చేసిన పొలిటికల్ మ్యాప్లో పాక్ ఆక్రమిత కశ్మీర్ భూభాగంను కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూ కశ్మీర్లో చేర్చగా గిల్గిట్-బల్తిస్తాన్ ప్రాంతాన్ని మరో కేంద్రపాలితప్రాంతమైన లడఖ్లో చేర్చింది.
ఇదిలా ఉంటే కాలాపాని మాత్రం నేపాల్ కు చెందుతుందని ఆ ప్రభుత్వం తెలిపింది. ఇంకా సమస్యకు పరిష్కారం దొరకకపోవడంతో ఇటు భారత్ అటు నేపాల్ ప్రభుత్వాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. కాలాపాని నేపాల్కు చెందుతుందని ఆ దేశ విదేశీవ్యవహారాల మంత్రిత్వ శాఖ బలంగా చెబుతోంది. అయితే వివాదాస్పదంగా మారిన ఈ భూభాగంపై రెండు దేశాల విదేశీ వ్యవహారాల శాఖ మంత్రులు చర్చిస్తారని నేపాల్ ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. అంతేకాదు భారత్ - నేపాల్ సరిహద్దులపై కూడా చర్చలు జరుపుతారని సమాచారం.
ఇక సరిహద్దులకు సంబంధించి సమస్యలు రాకుండా రెండుదేశాల మధ్య ఏకాభిప్రాయంతో ముందుకెళ్లాలని భావిస్తున్నట్లు ప్రకటనలో పేర్కొంది. ఏకపక్ష ధోరణితో తీసుకునే నిర్ణయంకు నేపాల్ వ్యతిరేకమని ప్రకటనలో ఆ ప్రభుత్వం స్పష్టం చేసింది. శనివారం రోజు భారత్ విడుదల చేసిన తాజా పొలిటికల్ మ్యాప్లో ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పితోర్ఘడ్ జిల్లా కిందకు కాలాపానిని చేర్చింది. దీనిపైనే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది నేపాల్. కాలాపాని నేపాల్లోని దార్చులా జిల్లా కిందకు వస్తుందని ఆ దేశ ప్రభుత్వం చెబుతోంది. నేపాల్ లేవనెత్తిన అభ్యంతరంపై భారత్ ఇంకా స్పందించాల్సి ఉంది.
నేపాల్ సరిహద్దులను పరిరక్షించుకోవడం తమ ప్రభుత్వంపై ఉన్న బాధ్యత అని ఒకవేళ సరిహద్దుల విషయంలో పొరుగుదేశాలతో విబేధాలు తలెత్తితే దౌత్యపరమైన చర్చల ద్వారా పరిష్కరించుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు నేపాల్ విదేశీ వ్యవహారాల శాఖ ఒక ప్రకటన ద్వారా తెలిపింది. ఇందుకోసం చారిత్రక నేపథ్యం, నిజనిజాలు, రుజువులు పొందుపరుస్తామని వెల్లడించింది.