కాళీమాతకు అభిషేకం.. భారీగా మానవ రక్తం! కేరళలో పోస్టర్ సంచలనం..
తిరువనంతపురం: దేవుళ్లు, దేవతలకు అభిషేకాలు చేయడం మామూలే. ఇందుకు పాలు, వివిధ తైలాలు ఉపయోగిస్తుంటారు. కొన్ని ఆలయాల్లో జంతువులను బలి ఇచ్చి వాటి రక్తంతో అభిషేకం చేయడం కూడా విన్నాం.. చూశాం. ఇక మనుషుల రక్తంతో అభిషేకం చేయడం అప్పుడప్పుడు సినిమాల్లో చూస్తుంటాం.
కానీ కేరళలో ఇటీవల వెలిసిన ఓ పోస్టర్ అందరినీ ఆశ్చర్యపరచడమేకాదు చర్చనీయాంశంగా కూడా మారింది. అక్కడి కాళీమాత ఆలయానికి అభిషేకం చేసేందుకు భారీగా రక్తం కావాలని, దానికోసం భక్తులు వీలైనంత త్వరగా వారి రక్తాన్ని దానంగా పంపించాలనేది ఆ పోస్టర్లోని సారాంశం.
తిరువనంతపురం జిల్లా పరిధిలోని విధుర అనే గ్రామ ఆలయ అధికారులు ఈ మేరకు బహిరంగంగా ప్రకటన చేశారు. పోస్టర్లు వేయించారు. ఈ ఆలయంలో ప్రతియేటా జరిగే ఉత్సవాల్లో భాగంగా రక్తాభిషేకం చేయాల్సి ఉన్నందున భక్తులంతా త్వరగా వారి రక్తాన్ని దానం చేసి ఆలయానికి పంపించాలంటూ అందులో ప్రకటించారు.
విచిత్రం ఏమిటంటే.. భక్తుల వద్ద నుంచి ప్రభుత్వ ఆమోదం పొందిన వైద్యులే రక్తాన్ని భద్రంగా సేకరిస్తారని కూడా ఆ ప్రకటనలో వెల్లడించడం. మార్చి 12న సాయంత్రం 6 గంటలకు ఈ ఉత్సవం జరగనుందట. ఈ ఉత్సవాన్ని మహాఘోర కాళీయజ్ఞంగా పిలుస్తారు. మొత్తం పధ్నాలుగు రోజులపాటు జరిగే ఈ ఉత్సవంలోని రెండో రోజున కాళీమాతకు రక్తాభిషేకం నిర్వహిస్తారు.