యూపీలో ఘోర రైలు ప్రమాదం... 23 మంది మృతి, 40 మందికి గాయాలు
ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్లోని ఖతౌలి వద్ద శనివారం సాయంత్రం జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 23 మంది మృతిచెందగా.. 40 మందికి పైగా గాయపడ్డారు. వారికి స్థానిక ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
లక్నో: ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్లోని ఖతౌలి వద్ద ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. పూరీ- హరిద్వార్-కలింగా మధ్య నడిచే ఉత్కల్ ఎక్స్ప్రెస్ రైలుకు చెందిన 14 బోగీలు పట్టాలు తప్పాయి.
ఈ ప్రమాదంలో 23 మంది మృతిచెందగా.. 40 మందికి పైగా గాయపడ్డారు. వారికి స్థానిక ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రమాద స్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
ఉత్కల్ ఎక్స్ప్రెస్ రైలు పూరీ నుంచి హరిద్వార్ వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పట్టాలు తప్పిన రైలు బోగీలు సమీపంలోని ఇళ్లపైకి దూసుకెళ్లడంతో ఆ ఇళ్లలోని వారికి గూడా తీవ్ర గాయాలు అయ్యాయి.
ఈ ప్రమాదంపై రైల్వే మంత్రి సురేష్ ప్రభు విచారణకు ఆదేశించారు. ప్రమాదానికి కారణమైన లోపాలకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు చేపడతామన్నారు. శనివారం సాయంత్రం 5.50 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. ఆరు బోగీలు పట్టాలు తప్పాయి. ఘటనా స్థలానికి మెడికల్ వ్యాన్స్, వైద్య సిబ్బంది చేరుకున్నట్లు సురేష్ ప్రభు చెప్పారు.
సహాయ కార్యక్రమాలపై తాను స్వయంగా పర్యవేక్షిస్తున్నానని, సహాయ చర్యలను వేగవంతం చేయాలని రైల్వే బోర్డు ఛైర్మన్ను ఆదేశించామని సురేష్ ప్రభు చెప్పారు. ఘటనా స్థలానికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకుని సహాయ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యాయి.
ఇప్పటివరకూ 50 మంది ప్రయాణికులను కాపాడినట్టు అధికారులు తెలిపారు. ఒడిశాలోని పూరి నుంచి ఉత్తరాఖండ్లోని హరిద్వార్కు రైలు వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
హెల్ప్ లైన్లు
ప్రమాద ఘటనపై వివరాలు తెలుసుకునేందుకు హెల్ప్ లైన్లు కూడా ఏర్పాటు చేసినట్టు రైల్వే అధికారులు తెలిపారు. 9760534054, 5101 నెంబర్లకు పోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చన్నారు. మీరట్ జిల్లా ఆసుపత్రి సైతం 94544 55183 నెంబర్తో హెల్ప్లైన్ ఏర్పాటు చేసింది.
ప్రధాని దిగ్బాంతి
రైలు ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సంఘటన తనను ఎంతగానో కలచివేసిందని ఆయన అన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. రైల్వే మంత్రిత్వ శాఖ, ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ తగిన చర్యలు తీసుకుంటున్నట్లు ట్విటర్లో తెలిపారు.
సంఘటనా స్థలికి ఇద్దరు మంత్రులు
ప్రమాద ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తక్షణ సహాయక చర్యలకు ఆదేశించడంతో పాటు ఇద్దరు మంత్రులను ఘటనా స్థలికి పంపారు. క్షతగాత్రులకు చికిత్స అందించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. వారికి ఉచిత వైద్య సదుపాయం కల్పించాలని ఆదేశించారు..
దురదృష్టకరం: రాహుల్
రైలు ప్రమాద ఘటన దురదృష్టకరమని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.