కల్కా-న్యూఢిల్లీ ఎక్స్ప్రెస్ రైలులో అగ్ని ప్రమాదం: కారణం ఇదే
న్యూఢిల్లీ: కల్కా-న్యూఢిల్లీ శతాబ్ది ఎక్స్ప్రెస్ రైలులో బుధవారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బ్రేక్స్ రబ్బర్, చక్రాల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో మంటలు చెలరేగాయి. దీంతో రైలును నిలిపివేశారు. ఈ ఘటన అంబాల, కురుక్షేత్ర మధ్య జరిగింది.
కల్కా-న్యూఢిల్లీ శతాబ్ది ఎక్స్ప్రెస్ రైలు 12012 కల్కా నుంచి హర్యానా, న్యూఢిల్లీకి వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. బ్రేకులు తీవ్రంగా వేడి ఎక్కడం వల్లే ఈ మంటలు వచ్చాయని అధికారులు తెలిపారు.
మొదట కల్కా-న్యూఢిల్లీ ఎక్స్ప్రెస్ సీ-3 బోగీకి మంటలు వ్యాపించాయి. వెంటనే రైలును నిలిపివేసి.. అందులోని ప్రయాణికులను కిందికి దించడంతో ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదం కారణంగా భారీగా పొగలు రైలును కమ్మేశాయి.
సమాచారం అందుకున్న మెకానిక్ వెంటనే ఘటనా స్థలానికి చేరున్నాడు. లోపాన్ని గుర్తించి సరిచేశారు. ఈ ప్రమాదం కారణంగా కల్కా-న్యూఢిల్లీ ఎక్స్ప్రెస్ రైలు సుమారు 20 నిమిషాలపాటు ఆగిపోయింది.
రైల్వే శాఖ అధికారులు వెంటనే స్పందించడంతో రైలు అక్కడ్నుంచి కదిలింది. ప్రస్తుతం ఆ రైలు ఢిల్లీ వైపు పయనమైంది. ప్రమాద ఘటనలో ఎవరికీ ఎలాంటి హాని జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.