షాక్: యూట్యూబ్ ఫేక్ న్యూస్తో కళ్యాణ్ జువెల్లర్స్కు 500కోట్ల నష్టం, హైకోర్టుకు, ప్రత్యర్థుల పనే!
తిరువనంతపురం: తమ సంస్థపై తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కళ్యాణ్ జువెల్లర్స్ కేరళ హైకోర్టును ఆశ్రయించింది. నకిలీ ఆభరణాలు అమ్ముతున్నామంటూ తమపై జరుగుతున్న తప్పుడు ప్రచారంతో ఇప్పటికే రూ. 500కోట్ల మేర నష్టం వాటిల్లందంటూ తన పిటిషన్లో పేర్కొంది.
యాజమాన్యం దిగ్భ్రాంతి
నకిలీ బంగారు ఆభరణాలు అమ్ముతున్న కారణంగా కళ్యాణ్ జువెల్లర్స్ను సీజ్ చేశారంటూ యూట్యూబ్లో వీడియోలు ప్రసారం కావడంతో కంపెనీ యాజమాన్యం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది.
ఎడిట్ చేసి దుష్ప్రచారం
కళ్యాణ్ జువెల్లర్స్ కువైట్ బ్రాంచీలో జరిగిన సాధారణ తనిఖీలకు సంబంధించిన వీడియోలను ఎడిట్ చేసి ఈ విధంగా దుష్ప్రచారానికి పాల్పడుతున్నట్లు గుర్తించి సంస్థ, నష్ట నివారణ చర్యల్లో భాగంగా హైకోర్టును ఆశ్రయించింది.
ప్రత్యర్థుల పనే..
సాధారణ తనిఖీలను అవినీతి నిరోధక శాఖ దాడులుగా చిత్రీకరించి ప్రత్యర్థి కంపెనీలు దుష్ప్రచారానికి పాల్పడుతున్నాయని కళ్యాణ్ జువెల్లర్స్ ఆరోపించింది. కళ్యాణ్ జువెల్లర్స్ లోగోతో యూట్యూబ్ ఛానల్లో నకిలీ వీడియోలను అప్లోడ్ చేస్తూ తమ బ్రాండ్ విశ్వసనీయతను దెబ్బతీస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోర్టును కోరింది. సోషల్ మీడియాపై సరైన నిఘా లేనందువల్లే ఇలాంటి నకిలీ వార్తలు, వీడియోలు ప్రసారం అవుతున్నాయని ఆరోపించింది.
ప్రభుత్వానికి నోటీసులు
కళ్యాణ్ జువెల్లర్స్ పిటిషన్ను స్వీకరించిన హైకోర్టు.. సోషల్ మీడియాలో నకిలీ వార్తలను అదుపు చేసేందుకు క్రమబద్ధీకరణలు, నిబంధనలు ప్రవేశపెట్టాల్సిందిగా ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. కాగా, గతంలో కూడా కళ్యాణ్ జువెల్లర్స్పై ఇలాగే దుష్ప్రచారం చేసిన వారిపై ఫిర్యాదు చేయడంతో.. ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.