ఫిబ్రవరి 21న మధురైలో పార్టీ ప్రకటన,కమల్ పార్టీలో కి ఐఎఎస్, ఐపీఎస్లు?
చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో మరో కొత్త పార్టీ అవతరించనుంది. సినీ నటుడు కమల్ హసన్ ఫిబ్రవరి 21వ, తేదిన మధురైలో పార్టీ పేరును , పార్టీ జెండాను ఆవిష్కరించనున్నట్టు ప్రకటించారు. శనివారం నాడు సిపిఐ సీనియర్ నేత నల్లకన్నును కమల్హసన్ ఆయన నివాసంలో కలుసుకొన్నారు. రాష్ట్ర రాజకీయాలపై నల్లకన్నుతో కమల్హసన్ చర్చించినట్టు సమాచారం.
రానున్న ఎన్నికల్లో కమల్హసన్ కూడ తమ పార్టీ ద్వారా ఎన్నికల రంగంలోకి ప్రవేశించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కమల్హసన్ ప్రజల సమస్యలను తెలుసుకొనేందుకు పర్యటన ప్రారంభించనున్నారు.
ఇప్పటికే తమిళనాడు సూపర్స్టార్ రజనీకాంత్ కూడ పార్టీని ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తానని రజనీకాంత్ కూడ ప్రకటించారు. ఈ మేరకు రజనీకాంత్ కూడ రంగం సిద్దం చేసుకొంటున్నారు.తమిళనాడులో ఇద్దరు అగ్రహీరోలు పార్టీలను ఏర్పాటు చేయాలని సంకల్పిస్తున్నారు. అయితే తొలుత కమల్హసన్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించేందుకు సమాయాత్తమౌతున్నారు.
ఫిబ్రవరి 21న కమల్హసన్ పార్టీ
ఫిబ్రవరి 21వ తేదిన కమల్హసన్ తన పార్టీ పేరును ప్రకటించనున్నారు. మధురైలో కమల్హసన్ పార్టీ పేరును , పార్టీ జెండాను ఆవిష్కరించనున్నట్టు ప్రకటించారు. శనివారం నాడు కమల్హసన్ ఈ విషయాన్ని మీడియాకు వివరించారు.అదే రోజు నుండి రాష్ట్రంలో తాను పర్యటించే టూరు షెడ్యూల్ను కూడ కమల్హసన్ ప్రకటించారు. ఫిబ్రవరి 21వ తేది నుండి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనకు శ్రీకారం చుట్టనున్నట్టు కూడ కమల్హసన్ ఇదివరకే ప్రకటించారు. మధురై సభలో పార్టీ పేరును, పార్టీ జెండాను కమల్ హసన్ ఆవిష్కరించనున్నారు..సాయంత్రం 5 గంటలకు మదురైలోని ఒత్తకడై మైదానం చేరుకుని, 6 గంటలకు బహిరంగ సభలో అభిమానుల సమక్షంలో రాజకీయ పార్టీ పేరు ప్రకటించి, జెండా ఆవిష్కరించనున్నారు కమల్హసన్.
కలాంకు నివాళులర్పించి యాత్రకు శ్రీకారం
దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ నివాసం నుంచే ఆయన రాజకీయ యాత్ర ప్రారంభించనున్నారు కమల్హసన్. ఫిబ్రవరి 21వ, తేదిన స్మారక మందిరంలో కలాంకు నివాళులర్పించిన అనంతరం అక్కడ నుంచి మదురైకి బయల్దేరి వెళ్తారు. 21వ తేదీ ఉదయం 7.45 గంటలకు రామేశ్వరంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఇంటిని, 8.15 గంటలకు అబ్దుల్కలాం చదువుకుతున్న పాఠశాలను సందర్శిస్తారు. 8.50 గంటలకు గణేష్ మహల్లో జాలర్లతో సమీక్షాసమావేశం నిర్వహించి, 11 గంటలకు - ఏపీజే అబ్దుల్ కలాం స్మారక మందిరంలో నివాళులర్పిస్తారు. అనంతరం 11.20 గంటలకు రాజకీయ యాత్ర ప్రారంభించి, మదురైకి బయల్దేరనున్నట్టు కమల్హసన్ ప్రకటించారు.
సిపిఐ సీనియర్ నేత నల్లకన్నుతో కమల్హసన్ భేటీ
రాష్ట్రంలోని సీనియర్ రాజకీయ నేతలందరినీ మర్యాదపూర్వకంగా కలుసుకుంటానని కమల్హాసన్ తెలిపారు. శనివారం ఉదయం ఆయన సీపీఐ సీనియర్ నేత ఆర్.నల్లకన్నును కలుసుకున్నారు. స్థానిక టి.నగర్లో ఉన్న సీపీఐ కార్యాలయానికి వెళ్లి నల్లకన్నుతో భేటీ అయ్యారు. సుమారు 20 నిమిషాలపాటు వారిరువురూ పలు అంశాలపై చర్చించుకున్నారు.అదే విధంగా అన్ని పార్టీల సీనియర్ నేతలనూ కలుసుకుంటానని చెప్పారు. నల్లకన్ను మాట్లాడుతూ.. తాను సీనియర్ నేతననే కమల్ కలిశారని, రాజకీయపరంగా ఎటువంటి సలహాలు అడగ లేదని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా రాజకీయాల్లోకి రావొచ్చని మరో ప్రశ్నకు ఆయన బదులిచ్చారు.
కమల్పార్టీలోకి ఐఎఎస్, ఐపీఎస్లు
కమల్హాసన్ ప్రారంభించబోయే పార్టీలో చేరేందుకు పలువురు పారిశ్రామికవేత్తలతోపాటు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా సిద్ధంగా ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. ఇప్పటికే రాష్ట్రంలోని బడా పారిశ్రామికవేత్త కమల్ ప్రారంభించబోయే పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని సమాచారం. అలాగే కొందరు మాజీ ఐఏఎస్, ఐపీఎస్లు కమల్ పార్టీలో సిద్ధంగా ఉన్నట్టు ఆయన అభిమానులు చెబుతున్నారు.