ఓటు వేసిన సూపర్ స్టార్స్: పోలింగ్ కేంద్రం వద్ద కుమార్తెతో కలిసి వరుసలో నిల్చుని..!
చెన్నై: దేశవ్యాప్తంగా రెండో దశ లోక్ సభ ఎన్నికల పోలింగ్ ఆరంభమైంది. తొలి గంటలో అన్ని ప్రాంతాల్లో ఓటింగ్ సజావుగా ఆరంభమైనట్లు సమాచారం. ఒకట్రెండు పోలింగ్ కేంద్రాల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు మొరాయించాయి. సాంకేతిక నిపుణులు వాటిని వెనువెంటనే సరి చేశారు. పలువురు ప్రముఖులు తొలి గంటలోనే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
పుదుచ్చేరి లెప్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ, తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్, ప్రముఖ నటుడు, మక్కళ్ నీధి మయ్యం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కమల్ హాసన్ చెన్నైలో ఓటు వేశారు. బెంగళూరులో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర మాజీమంత్రి చిదంబరం తమిళనాడులోని శివగంగ జిల్లా కారైకుడిలో ఓటు వేశారు.
చెన్నై సెంట్రల్ లోక్ సభ పరిధిలోని స్టెల్లా మేరీస్ కళాశాలలో రజినీకాంత్ ఓటు వేశారు. కమల్ హాసన్ తన కుమార్తె, నటి శృతి హాసన్ తో కలిసి పోలింగ్ కేంద్రానికి వెళ్లారు. శృతి హాసన్ తో కలిసి చెన్నై అళ్వార్ పేటలోని కార్పొరేషన్ పాఠశాలలోని 27వ నంబర్ పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లతో పాటు వరుసలో నిల్చున్నారు. తన వంతు వచ్చిన తరువాత ఓటు వేశారు. బెంగళూరు సౌత్ లోక్ సభ పరిధిలోని జయనగరలో 54వ నంబర్ పోలింగ్ బూత్ లో నిర్మలా సీతారామన్ ఓటు వేశారు.