మిసైల్ మ్యాన్ అబ్దుల్ కలామ్ ఇంటి నుంచి హీరో కమల్ హాసన్ పొలిటికల్ ఏంట్రీ, ఫిక్స్!
చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో చక్రం తిప్పాలని ప్రయత్నిస్తూ రాజకీయ రంగప్రవేశం చేస్తున్న బహుబాష నటుడు, దర్శక నిర్మాత కమల్ హాసన్ తన రాజకీయ రంగప్రవేశానికి, తమిళనాడు రాష్ట్ర పర్యటనకు వేదిక ఖరారు చేసుకున్నారు. దివంగత మాజీ రాష్ట్రపతి, మిసైల్ మ్యాన్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్ ఇంటి నుంచి తమిళనాడు రాష్ట్ర పర్యటన చెయ్యాలని హీరో కమల్ హాసన్ ఫిక్స్ అయ్యారు.
మిసైల్ మ్యాన్
భారత మాజీ రాష్ట్రపతి, ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ అబ్దుల్ కలామ్ దేశం కోసం ఎంతో సేవ చేసి మిసైల్ మ్యాన్ గా గుర్తింపు తెచ్చుకున్నారని, ఆయనకు మొదట నివాళులు అర్పించిన తరువాత తమిళనాడు రాష్ట్ర పర్యటన చేపడుతానని కమల్ హాసన్ స్పష్టం చేశారు.
రామనాథపురం
డాక్టర్ అబ్దుల్ కలామ్ జన్మించిన తమిళనాడులోని రామనాథపురంలో ఈనెల 21వ తేదీన ఆయకు నివాళులు అర్పించిన తరువాత రాజకీయ రంగ్రప్రవేశం చేస్తానని కమల్ హాసన్ ప్రకటించారు. దేశం కోసం అబ్దుల్ కలామ్ ఏం త్యాగం చేశారో మరోసారి అందరికీ గుర్తు చేస్తానని కమల్ హాసన్ వివరించారు.
కలామ్ ఆశయాలు
డాక్టర్ అబ్దుల్ కలామ్ ఆశయాలకు అనుగుణంగా తన రాజకీయాలు ఉంటాయని, తమిళనాడు ప్రజల క్షేమం, వారి అభివృద్దిని ఆకాంక్షిస్తూ తాను రాజకీయాల్లోకి వస్తున్నానని కమల్ హాసన్ చెప్పారు. ప్రజల క్షేమంగా ఉన్నప్పుడే రాష్ట్ర ప్రభుత్వం క్షేమంగా ఉంటుందని కమల్ హాసన్ వివరించారు.
ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి
ప్రజలు ఏర్పాటు చేసిన ప్రజా ప్రభుత్వం వారి సొంత లాభాల కోసం పని చెయ్యకూడాదని కమల్ హాసన్ అంటున్నారు. తమ హక్కుల కోసం ప్రతి ఒక్కరూ ప్రభుత్వాన్ని ప్రశ్నించినప్పుడే మీరు అభివృద్ది చెందుతారని కమల్ హాసన్ ప్రజలకు సూచించారు.
నిజాయితీ కోసం
దేశం కోసం, నీతి నిజాయితీ కోసం చివరి వరకూ పోరాటం చేసిన డాక్టర్ అబ్దుల్ కలామ్ ఆశయాలకు అనుగుణంగా తన రాజకీయాలు ఉంటాయని ప్రజలకు చాటి చెప్పడానికే కమల్ హాసన్ రామనాథపురం నుంచి తమిళనాడు రాష్ట్ర పర్యటన చేపట్టాలని నిర్ణయించారని తెలిసింది.
రజనీకాంత్ విషయంలో !
తన రాజకీయాలు ఎలా ఉంటాయి అనే విషయం స్పష్టంగా చెబుతున్న హీరో కమల్ హాసన్ సాటి నటుడు రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశం, ఆయనతో పొత్తు విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు. మొత్తం మీద డాక్టర్ అబ్దుల్ కలామ్ ఆశయాలు నేరవేర్చుతానని కమల్ హాసన్ స్పష్టంగా ప్రకటించారు.