కమల్ హాసన్ థర్డ్ ఫ్రంట్ రెడీ... సీట్ల లెక్కలు కొలిక్కి... ఎవరెన్ని చోట్ల పోటీ చేస్తున్నారంటే...
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కమల్ హాసన్ సారథ్యంలోని మక్కల్ నీది మయ్యమ్(ఎంకెఎం) పార్టీ పొత్తులతో బరిలో దిగనుంది. మొత్తం 234 స్థానాలున్న తమిళనాడులో 154 స్థానాల్లో ఎంఎన్ఎం పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. మిగతా 80 స్థానాలను మిత్రపక్షాలకు సర్దుబాటు చేయనున్నట్లు తెలిపాయి. ఇందులో ఆల్ ఇండియా సమథువా మక్కల్ కచ్చి(IJK),ఇంధియా జననాయగ కచ్చి(AISMK) పార్టీలు చెరో 40 స్థానాలను పంచుకోనున్నాయి. యూపీఏ,ఎన్డీయేలకు ప్రత్యామ్నాయంగా ఐజేకె,ఏఐఎస్ఎంకెలతో కలిసి కమల్ హాసన్ ఈ థర్డ్ ఫ్రంట్ను ఏర్పాటు చేశారు.
పొత్తుపై ప్రకటన...
సీట్ల కేటాయింపులకు సంబంధించి కుదిరిన ఒప్పందంపై మక్కల్ నీది మయ్యమ్ ప్రధాన కార్యదర్శి సీకే కుమారవేల్,ఏఐఎస్ఎంకె వ్యవస్థాపకుడు శరత్ కుమార్,ఐజేకె నేత రవి పాచముత్తు సంతకాలు చేశారు. ఈ థర్డ్ ఫ్రంట్లోకి మరికొన్ని పార్టీలను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు కుమారవేల్ పేర్కొనడం గమనార్హం. 'దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న తమిళ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం ద్వారా రాష్ట్రాన్ని మార్పు వైపు నడిపించాలనే లక్ష్యానికి పార్టీలు కట్టుబడి ఉన్నాయి. తమిళనాడు ఆత్మగౌరవాన్ని, కీర్తిని పునరుద్ధరించే సాధారణ ఎజెండాతో దీర్ఘకాలం పాటు కలిసి నడవాలని మేము నిర్ణయించాం.' అని కుమారవేల్ వెల్లడించారు.
ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థుల ఎంపిక
అభ్యర్థుల ఎంపిక కోసం ఎంఎన్ఎం ఆన్లైన్ విధానాన్ని అనుసరిస్తోంది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల ప్రొఫైల్స్ను పరిశీలించి వారిని ఇంటర్వ్యూలకు పిలుస్తోంది. అలా ఇంటర్వ్యూల్లో ఎంపికైనవారికి టికెట్లు ఇస్తోంది. ఈ ఎన్నికల్లో ప్రధానంగా అవినీతి,నిరుద్యోగం,గ్రామాల అభివృద్ది తదితర అంశాలను ఎంఎన్ఎం లేవనెత్తుతోంది. తాము అధికారంలోకి వస్తే ఇంటింటికి ఉచిత కంప్యూటర్లతో పాటు ఇంటర్నెట్ సౌకార్యాన్ని కూడా అందిస్తామని ఇప్పటికే హామీ ఇచ్చింది. ఎంఎన్ఎం పార్టీకి ఇవే తొలి అసెంబ్లీ ఎన్నికలు కావడం గమనార్హం. 2019 లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసిన ఆ పార్టీ ఒక్క స్థానంలోనూ గెలవలేకపోయింది.
డీఎంకె-కాంగ్రెస్,అన్నాడీఎంకె-బీజేపీ...
మరోవైపు డీఎంకె-కాంగ్రెస్,అన్నాడీఎంకె-బీజేపీ పొత్తులతో బరిలో దిగుతున్న సంగతి తెలిసిందే. రెండు కూటముల్లోనూ సీట్ల పంపకాలు ఇంకా కొలిక్కి రాలేదు. ఇప్పటికీ రెండు కూటములు సీట్ల షేరింగ్పై చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు అసద్దుద్దీన్ ఓవైసీ నేత్రుత్వంలోని ఎంఐఎం కూడా టీటీవీ దినకరన్ పార్టీతో కలిసి బరిలో దిగబోతున్నట్లు కథనాలు వస్తున్నాయి. బిహార్లో సత్తా చాటిన తర్వాత ఆ పార్టీ దేశం నలుమూలలా విస్తరించేందుకు ప్రయత్నిస్తోంది. తమిళనాడు ఎన్నికల్లో ఈసారి చిన్నమ్మ శశికళ యూటర్న్ తీసుకోవడం అన్నింటికి మించి పెద్ద ట్విస్ట్ అనే చెప్పాలి. ఆమె ఎన్నికల బరిలో లేకపోవడం రాజకీయ సమీకరణాలను తీవ్రంగా ప్రభావితం చేయనుంది. బీజేపీ వల్లే ఆమె పోటీ నుంచి తప్పుకుని ఉండవచ్చునన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. శశికళ పోటీలో ఉంటే అన్నాడీఎంకెకి నష్టం గనుక బీజేపీనే ఆమెను పక్కకు తప్పించేలా ప్లాన్ చేసిందన్న ప్రచారం జరుగుతోంది.