కమల్ పార్టీ గూటికి శరత్ కుమార్: పోటీలో రాధిక, లారెన్స్: సరికొత్త ఈక్వేషన్స్: అన్నీ కలిసొస్తే
చెన్నై: అసెంబ్లీ ఎన్నికల ముంగిట్లో.. తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. సరికొత్త ఈక్వేషన్లు పుట్టుకొస్తోన్నాయి. భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్నికలను ఎదుర్కొనడానికి సమాయాత్తమౌతోన్న అధికార ఏఐఎడీఎంకేతో కలిసి రాజకీయ ప్రయాణాన్ని సాగించడానికి మిత్రపక్షాలు అంగీకరించట్లేదు. చాలాకాలం పాటు అన్నా డీఎంకేకు దూరంగా ఉంటూ వస్తోన్న ఆ పార్టీ మిత్రపక్షాలు.. ఎన్నికలు సమీపించే సరికి గుడ్బై చెబుతున్నాయి. అలాగనీ- ప్రతిపక్ష డీఎంకేకు అండగా ఉండదలచుకోలేదు.
లోక నాయకుడు కమల్ హాసన్ వైపు చూపులు సారిస్తున్నాయి. ఏఐఎండీఎంకే, డీఎంకేలకు ప్రత్యామ్నాయంగా మక్కల్ నీథి మయ్యం (MNM)కు సపోర్ట్ చేస్తోన్నాయి. ఒకే రెండు పార్టీలు కమల్ హాసన్కు మద్దతు ప్రకటించడం తమిళనాట సరికొత్త రాజకీయ సమీకరణాలకు తెర తీసినట్టయింది. నటుడు శరత్ కుమార్ నెలకొల్పిన ఆల్ ఇండియా సమతువ మక్కల్ కచ్చి (AISMK) పార్టీ తాజాగా కమల్ హాసన్తో పొత్తు కుదుర్చుకుంది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి సీట్ల సర్దుబాటు చేసుకోనుంది.
ఏఐఎస్ఎంకేతో పాటు ఇంధియ జననాయగ కచ్చి (IJK) కూడా కమల్ హాసన్కు మద్దతు ప్రకటించింది. ఈ నేపథ్యంలో- తమిళనాడు రాజకీయాల్లో ఎంఎన్ఎం మూడో ప్రత్యామ్నాయ కూటమిగా ఆవిర్భవించే అవకాశాలు లేకపోలేదు. థర్డ్ ఫ్రంట్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా కమల్ హాసన్ పేరును శరత్ కుమార్ ప్రకటించారు. తమ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి ఆయనేని తెలిపారు. తూత్తుకుడిలో నిర్వహించిన పార్టీ సర్వసభ్య సమావేశంలో ఆయన ఈ నిర్ణయాన్ని ప్రకటించారు.
Recommended Video
వచ్చే ఎన్నికల్లో తాము కమల్ హాసన్తో కలిసి పోటీ చేస్తామని వెల్లడించారు. దీనికోసం ఆయనతో సీట్ల సర్దుబాటు చేసుకుంటామని అన్నారు. శరత్ కుమార్ భార్య, నటి, ఏఐఎస్ఎంకే రాధికా శరత్ కుమార్, నటుడు రాఘవ లారెన్స్ తమ పోటీ చేయనున్నట్లు చెప్పారు. రాధాపురం నియోజకవర్గం నుంచి లారెన్స్, కోవిల్పట్టి స్థానం నుంచి రాధికా శరత్ కుమార్ పోటీ చేస్తారని పేర్కొన్నారు. కమల్ హాసన్తో పొత్తు పెట్టుకోవడానికి మరికొన్ని పార్టీలు ఆసక్తిగా ఉన్నాయని స్పష్టం చేశారు. భావసారూప్యం గల పార్టీలను తాము ఆహ్వానిస్తున్నామని చెప్పారు. అసదుద్దీన్ ఒవైసీకి చెందిన ఏఐఎంఐఎం కూడా కమల్ హాసన్తో కలిసి పోటీ చేయబోతోంది.