నేడే కమల్ పొలిటికల్ ఎంట్రీ: పార్టీ ద్రవిడ సెంటిమెంటుతోనే.. కానీ?
Recommended Video
చెన్నై: దివంగత సీఎం జయలలిత మరణం తర్వాత ఏర్పడ్డ నాయకత్వ శూన్యతను భర్తీ చేయడానికి తమిళనాడులో ఆసక్తికర రాజకీయ పోటీ నడుస్తోంది. ప్రధానంగా సినీ రంగం నుంచి రాజకీయాల వైపు మళ్లుతున్న కమల్ హాసన్, రజనీకాంత్ ల పైనే అందరి దృష్టి నెలకొంది. రాజకీయాల్లోకి వస్తున్నానంటూ రజనీ ఇప్పటికే క్లారిటీ ఇచ్చేయగా.. ఇప్పుడు కమల్ కూడా బరిలో దిగడానికి సిద్దమయ్యారు.
నేడే ప్రకటన:
రాజకీయ తెరంగేట్రం చేస్తున్న ప్రముఖ సినీనటుడు కమల్హాసన్ బుధవారం తన పార్టీ పేరును ప్రకటించనున్నారు. బుధవారం ఉదయం రామేశ్వరంలోని అబ్దుల్ కలాం సమాధి వద్ద నివాళులు అర్పించిన అనంతరం.. అక్కడి నుంచి రోడ్ షో ద్వారా తన రాజకీయ యాత్రను మొదలుపెట్టనున్నారు.
మధురై సభతో..:
రోడ్ షోలో భాగంగా మార్గమధ్యలో పలుచోట్ల ప్రసంగించనున్నారు కమల్. ఆపై సాయంత్రం మధురైలో జరిగే భారీ బహిరంగ సభలో పార్టీ పేరుతో పాటు జెండాను పరిచయం చేయనున్నారు. ఈ సభకు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధ్యక్షుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రత్యేక అతిథిగా హాజరుకానున్నారు.
ఈ నేపథ్యంలో మంగళవారమే కమల్ హాసన్ రామేశ్వరానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా నామ్ తమిళర్ కట్చి నాయకుడు సీమాన్ కమల్ను కలుసుకుని శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో తామిద్దరం కలిసి పని చేస్తామని ప్రకటించారు.
హీరో కమల్ హాసన్ బహిరంగ సభ, ముగ్గురు సీఎంలు, పార్టీ పేరు, సిద్దాంతాలు, సవాల్!
అప్పుడే విమర్శలు:
రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్న కమల్ హాసన్ పై అప్పుడే విమర్శలూ మొదలయ్యాయి. రజనీకాంత్, కమల్హాసన్ కాగితపు పూల లాంటివారని డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం.కె.స్టాలిన్ విమర్శించారు.
కాలచక్రంలో రుతువులు మారినప్పుడు కొన్ని కాగితపు పూలు అందంగా వికసించడం సహజమని, కానీ అవి సువాసనలు వెదజల్లలేవని ఎద్దేవా చేశారు. ఎంత వేగంగా వికసిస్తాయో అంతే వేగంగా రాలిపోతాయన్నారు.
పువ్వును కాదు.. విత్తనాన్ని..:కమల్ కౌంటర్
డీఎంకె వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చారు కమల్. 'నేను కాగితపు పువ్వును కాదు, విత్తనాన్ని. దానిని నాటి చూస్తే ఏపుగా పెరుగుతా. విత్తనాన్ని ఎవరూ వాసన చూడాల్సిన పని లేదు' అని ధీటుగా స్పందించారు. తన రాజకీయాల్లో ప్రజలంతా భాగస్వాములు కావాలని కోరుకుంటున్నట్టు ట్వీట్ చేశారు.
జయలలితనే ఫాలో అవుతారా? లేక..:
కమల్ హాసన్ పార్టీ కూడా కేవలం ఏక వ్యక్తి కేంద్రంగానే ఉండబోతుందా? అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైతే పార్టీకి సంబంధించి కమల్ తప్ప మరో ముఖమేది తెరపై లేదు. కాబట్టి కమల్ జయలలిత లాగే తాను మాత్రమే పార్టీని కమాండ్ చేయాలనుకుంటారా?.. లేక మరో బలమైన నేతను నం.2గా పెడుతారా? అన్నది చూడాలి.
ద్రవిడ సెంటిమెంటే.. కానీ?:
మధురైలో జరిగే సభలో పార్టీ కమిటీలతో పాటు పలువురు కీలక నేతల పేర్లను కమల్ వెల్లడించే అవకాశం ఉందంటున్నారు. ఇకపోతే పార్టీ ద్రవిడ సెంటిమెంటుతోనే కొనసాగుతుందని, అయితే పేరులో మాత్రం 'ద్రవిడ', 'కజగం' అన్న పేర్లు ఉండబోవని తెలుస్తోంది. ఇక జెండా విషయానికొస్తే.. రెండు లేదా మూడు రంగుల్లో ఉంటుందని సమాచారం.