కబాలితో భారతీయుడు భేటీ: తమిళ ఎన్నికల పోరులో రజినీ మద్దతు కమల్కు ఉంటుందా...?
చెన్నై: తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో అక్కడ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ప్రస్తుతం అక్కడ అన్నాడీఎంకే ప్రభుత్వంలో ఉండగా డీఎంకే ప్రతిపక్షంలో ఉంది. అయితే ఈ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు యూనివర్శల్ స్టార్ కమల్ హాసన్ మక్కల్ నీది మయమ్ పార్టీని మూడేళ్ల క్రితం ఏర్పాటు చేశారు. ఇక ఆ తర్వాత మరో సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయ రంగప్రవేశం దాదాపుగా ఖరారైన సమయంలో తన ఆరోగ్యం దృష్ట్యా రాజకీయ పార్టీని ఏర్పాటు చేయడం లేదని సుస్పష్టంగా చెప్పేశారు. రజినీకాంత్ పార్టీ పెట్టినట్లయితే కచ్చితం కొంత ప్రభావం చూపి ఉండేవారనే అభిప్రాయం చాలామంది విశ్లేషకులు వ్యక్తం చేశారు. ఇప్పుడు రజినీ ప్లేస్ను భర్తీ చేసేందుకు కమల్ హాసన్ వేగంగా అడుగులు ముందుకు వేస్తున్నారు. ఈ క్రమంలోనే కబాలితో భారతీయుడు దాదాపు అరగంట పాటు భేటీ అయ్యారు. దీంతో తమిళ రాజకీయాలపై మరింత ఆసక్తికరంగా మారాయి.
మక్కల్ నీది మయమ్(ఎంఎన్ఎం) అధినేత కమల్ హాసన్ సూపర్ స్టార్ రజినీకాంత్తో సమావేశమయ్యారు. కమల్కు రాజకీయంగా రజినీకాంత్ మద్దతు ఇస్తారన్న వార్తలు ప్రచారంలో ఉన్న నేపథ్యంలో వీరిద్దరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఆదివారం రోజున కమల్ హాసన్ ఎంఎన్ఎం పార్టీ సమావేశాన్ని నిర్వహించనున్నారు. పూర్తిస్థాయిలో ఇక ప్రచారంకే తన సమయాన్ని కేటాయిస్తానని కమల్ హాసన్ గతంలో చెప్పారు. అదే సమయంలో రజినీకాంత్ను కలిసి మద్దతు కోరుతానని కూడా స్పష్టం చేశారు. అయితే గతేడాది డిసెంబర్ 29న తాను రాజకీయ పార్టీ ఏర్పాటు చేయడం లేదని రజినీకాంత్ తేల్చేశారు. అయితే రజినీకాంత్ సన్నిహితుడు గాంధీయ మక్కల్ ఇయక్కమ్ పార్టీ వ్యవస్థాపకులు తమిళరువి మనియన్ మరో వెర్షన్ వినిపించారు. రజినీకాంత్ రాజకీయాలకు దూరంగా ఉంటానని ఎప్పుడూ చెప్పలేదని.. అయితే ప్రస్తుతం ఎన్నికల బరిలో దిగడం లేదని మాత్రమే చెప్పాడంటూ కొత్త వాణి వినిపించారు. అంతేకాదు రజినీ మక్కల్ మండ్రం పార్టీని కూడా నిర్వీర్యం చేయలేదని తమిళరువి మనియన్ స్పష్టం చేశారు.
భవిష్యత్తులో రజినీకాంత్ రాజకీయాల్లోకి వస్తే తన పార్టీలో గాంధీయ మక్కల్ ఇయ్యక్కమ్ను విలీనం చేస్తామని మనియన్ చెప్పారు. ఒకవేళ రజినీ రాజకీయాల్లోకి ప్రవేశించకపోయినప్పటికి కూడా తన పార్టీ అనుబంధ పార్టీగా కొనసాగుతుందని మనియన్ చెప్పారు. ఇదిలా ఉంటే కమల్ హాసన్ పార్టీ మరో సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. తమ పార్టీ నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థుల వివరాలను ఆన్లైన్ ద్వారా సేకరిస్తోంది. ఆ తర్వాత వచ్చిన దరఖాస్తుల నుంచి అభ్యర్థులను సెలెక్ట్ చేస్తామని ప్రకటించింది. ఆదివారం నుంచి దరఖాస్తుల స్వీకరణ అధికారికంగా ప్రారంభం అవుతుందని కమల్ హాసన్ పార్టీ ప్రతినిధులు పేర్కొన్నారు. అయితే దరఖాస్తుదారులు రూ.25వేలు చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే ఆదివారం (ఫిబ్రవరి 21)న జరగనున్న సమావేశంలో రానున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ విధివిధానాలను, పొత్తులను, అభ్యర్థుల ఎంపిక ప్రక్రియపై ఒక ప్రకటన చేస్తారని సమాచారం. ఇదిలా ఉంటే గతనెలలోనే కమల్ హాసన్ పార్టీ గుర్తుగా బ్యాటరీ టార్చ్ను ఎన్నికల సంఘం కేటాయించింది. 2019 సంవత్సరంలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో కమల్ పార్టీ ఇదే బ్యాటరీ టార్చ్ గుర్తుపై బరిలో దిగింది. ఆ సమయంలో ఒక్క సీటు కూడా గెలవని కమల్ హాసన్ మక్కల్ నీది మయం పార్టీ... మొత్తంగా 3.77 శాతం ఓటు షేరు దక్కించుకుంది.
మొత్తానికి కమల్ రజినీతో భేటీ కావడం తమిళ రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. రజినీ కాంత్ కమల్ హాసన్ పార్టీకి మద్దతు తెలుపుతారా లేక కిమ్మనకుండా సైడ్ అయిపోతారా అనేది తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.