రూటు మార్చిన కమల్ హాసన్, జయ సమాధి దగ్గర, హీరో అజిత్ దంపతులు, ఏడాదిలో !
చెన్నై: తమిళనాడు ప్రభుత్వం మీద నిత్యం విమర్శలు చేస్తున్న బహుబాష నటుడు, దర్శక నిర్మాత కమల్ హాసన్ మంగళవారం ఒక్క సారిగా రూటు మార్చారు. జయలలిత మరణించి ఒక ఏడాది పూర్తి అయినా ఇంత వరకు కమల్ హాసన్ అమ్మకు ఒక్కసారికూడా నివాళి అర్పించలేదు.
మంగళవారం రూటు మార్చిన కమల్ హాసన్ తమిళనాడు ప్రభుత్వం మీద ఎలాంటి విమర్శలు చెయ్యకుండా అన్నాడీఎంకే పార్టీ అధినేత్రి, తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు నివాళులు అర్పించారు. మంగళవారం మెరీనా బీచ్ దగ్గరకు కమల్ హాసన్ చేరుకున్నారు.
కమల్ హాసన్ తో పాటు ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో మెరీనా బీచ్ చేరుకుని జయలలితకు నివాళి అర్పించారు. ఈ సందర్బంలో మీడియాతో మాట్లాడటానికి హీరో కమల్ హాసన్ నిరాకరించి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
జయలలిత మరణించిన తరువాత అప్పట్లో అమ్మ వారసుడు ప్రముఖ హీరో అజిత్ అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే చివరికి అజిత్ తాను రాజకీయాల్లోకి రాను అని తేల్చి చెప్పాడు. మంగళవారం అజిత్ తన భార్య షాలినితో కలిసి మెరీనా బీచ్ లోని అమ్మ సమాధి దగ్గరకు చేరుకుని నివాళి అర్పించారు.