కమల్ పార్టీలో చేరిన నటుడు నాజర్: భార్యకు లోక్ సభ టికెట్: అభ్యర్థుల తొలి జాబితా విడుదల
చెన్నై: రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన బహుభాషా నటుడు కమల్ హాసన్ వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మక్కళ్ నీధి మయ్యం పేరుతో రాజకీయ పార్టీని స్థాపించిన కమల్ హాసన్.. 21 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను బుధవారం విడుదల చేశారు. మిగిలిన నియోజకవర్గాల జాబితాను ఈ నెల 24వ తేదీన విడుదల చేస్తానని ప్రకటించారు. లోక్ సభ ఎన్నికల్లో తాను కూడా పోటీ చేస్తానని వెల్లడించారు.
ఎన్డీటీవీ విశ్లేషణ : యూపీ కోటాలో బీజేపీకి బీటలు, దెబ్బకొడుతోన్న ఎస్పీ, బీఎస్పీ కూటమి
నటుడు నాజర్ భార్యకు చోటు..
మొత్తం 39 లోక్ సభ స్థానాలు ఉన్న తమిళనాడులో తొలి విడత 21 సీట్లకు అభ్యర్థులను ప్రకటించారు. పుదుచ్చేరిలోని ఒకే ఒక్క లోక్ సభకూ అభ్యర్థిని ప్రకటిస్తామని కమల్ తెలిపారు. ప్రముఖ క్యారెక్టర్ నటుడు నాజర్ భార్యకు తొలి జాబితాలో చోటు దక్కింది. నాజర్ భార్య కమీలా చెన్నై సెంట్రల్ లోక్ సభ స్థానం నుంచి మక్కళ్ నీధి మయ్యం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. ఈ 21 మంది అభ్యర్థుల్లో ఎనిమిది మంది వ్యాపారవేత్తలు ఉన్నారు. డాక్టర్లు, న్యాయవాదులు ముగ్గురు చొప్పున ఉన్నారు.
జాబితాలో ఐపీఎస్ అధికారి కూడా..
పదవీ విరమణ చేసిన ఐపీఎస్ అధికారి ఏజీ మౌర్య కూడా పోటీలో ఉన్నారు. ఆయనకు చెన్నై నార్త్ స్థానాన్ని కేటాయించారు. డీఎంకే వ్యవస్థాపకుల్లో ఒకరైన ప్రముఖ న్యాయవాది అబిన్ పొయ్యమొళిని విల్లుపురం అభ్యర్థిగా ప్రకటించారు. డాక్టర్ ఎంఎఎస్ సుబ్రమణియన్ కు పుదుచ్చేరి టికెట్ ఇచ్చారు.
నా స్థానం ఏమిటనేది కార్యకర్తలే నిర్ణయిస్తారు..
ఈ నెల 24వ తేదీన కోయంబత్తూరులో మిగిలిన లోక్ సభ స్థానాలతో పాటు ఉప ఎన్నికలను ఎదుర్కొంటున్న 18 అసెంబ్లీ సీట్లకు అభ్యర్థులను ప్రకటిస్తానని కమల్ హాసన్ తెలిపారు. తొలి జాబితాను విడుదల చేసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని తెలిపారు. ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనేది కార్యకర్తల నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుందని అన్నారు. మెజారిటీ కార్యకర్తలు సూచించిన స్థానం నుంచి పోటీ చేస్తానని కమల్ హాసన్ చెప్పారు.