‘నేనే ముఖ్యమంత్రిని..’: కమల్ హాసన్ సంచలన ట్వీట్, రజనీకాంత్ కు చెక్?
తాజాగా కమల్ హాసన్ చేసిన ఓ ట్వీట్ తమిళనాట రాజకీయ చర్చకు దారి తీసింది. మంగళవారం రాత్రి ‘నేనే ముఖ్యమంత్రిని’ అంటూ కమల్ చేసిన ట్వీట్లు.. ఆయన రాజకీయ రంగప్రవేశం చేస్తున్నారా? అన్న ప్రశ్నలకు తావిస్తోంది.
చెన్నై: ప్రముఖ నటుడు కమల్ హాసన్ ఈ మధ్య కాలంలో ఏం చేసినా అది సంచలనమే అవుతోంది. ఇప్పటికే కమల్హాసన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న 'బిగ్బాస్' షో తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేపుతోంది. అధికార పార్టీకి చెందిన కొందరు మంత్రులు కూడా ఈ విషయంలో కమల్ హాసన్పై మండిపడుతున్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా కమల్ హాసన్ చేసిన ఓ ట్వీట్ తమిళనాట రాజకీయ చర్చకు దారి తీసింది. మంగళవారం రాత్రి 'నేనే ముఖ్యమంత్రిని' అంటూ కమల్ చేసిన ట్వీట్లు.. ఆయన రాజకీయ రంగప్రవేశం చేస్తున్నారా? అన్న ప్రశ్నలకు తావిస్తోంది.
అసలేం జరిగిందంటే...
కమల్ తన ట్విటర్లో.. ‘కాసేపటిలో ఓ ప్రకటన చేస్తా. అప్పటివరకు ఓపికపట్టండి' అంటూ తొలుత ఓ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ పెట్టిన కొద్దిసేపటికే.. ‘నన్ను ఓడిస్తే తిరగబడతా. నేను అనుకుంటే నేనే ముఖ్యమంత్రిని. రండి.. మూర్ఖులకు వ్యతిరేకంగా పోరాడేవాడే లీడర్' అని ట్వీట్ చేశారు. కమల్ తన ట్వీట్లో వాడిన ముఖ్యమంత్రి అన్న పదంతో ఆయన రాజకీయ రంగప్రవేశం చేస్తున్నారా? అన్న సందేహాలు రాష్ట్రవ్యాప్తంగా మొదలయ్యాయి.
Recommended Video
దమ్ముంటే రాజకీయాల్లోకి రా...
కమల్ ను ఉద్దేశించి మాట్లాడుతూ తమిళనాడు ఆర్థిక మంత్రి డి.జయకుమార్ ఇటీవల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దమ్ముంటే రాజకీయాల్లోకి రావాలంటూ కమల్ కు సవాల్ విసిరారు. అంతకుముందు న్యాయ శాఖ మంత్రి షణ్ముగం కూడా కమల్ ను ఉద్దేశించి పలువ వ్యాఖ్యాలు చేశారు. ఈ వ్యాఖ్యలను కమల్ హాసన్ సీరియస్ గా తీసుకున్నారా? క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారా? ఈ నేపథ్యంలోనే కమల్ ఈ ట్వీట్ చేశారా? అనే చర్చ ఇప్పుడు సర్వత్రా జరుగుతోంది.
ఇంతకీ ఆ ట్వీట్ లో ఏముందంటే...
తన ట్విట్టర్ అకౌంట్ లో కమల్ హాసన్ 11 లైన్ల పవర్ ఫుల్ కవితను పోస్ట్ చేశారు. "ప్రస్తుతం ఎవరూ రాజు కాదు. మనం విమర్శిద్దాం. మనం రాజులం కాము. ఓడినా, మరణించినా, నేను తీవ్రవాదినే. నేను తలచుకుంటే నేనే నాయకుడిని. లొంగి ఉండటానికి నేను బానిసను కాను. కిరీటాన్ని వదిలిపెట్టినంత మాత్రాన ఓడిపోయినట్టు కాదు. నాతో పాటు రండి కామ్రేడ్... అసంబద్ధతను బద్దలు గొట్టే నాయకుడిగా తయారవుతారు" ఈ విధంగా కొనసాగింది ఆయన కవిత్వం.
పన్నీర్ సెల్వం మద్దతు...
మంగళవారం రాత్రి ‘నేనే ముఖ్యమంత్రిని' అంటూ కమల్ చేసిన ట్వీట్ల నేపథ్యంలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం కమల్ హాసన్ కు మద్దతు పలికారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరైనా తమ అభిప్రాయాలను వెల్లడించవచ్చంటూ ఆయన పేర్కొనడం గమనార్హం. ఈ నేపథ్యంలో కమల్ హాసన్ నిజంగానే రాజకీయాల్లోకి వస్తున్నారా? త్వరలో పార్టీ పెట్టబోతున్న తలైవా రజనీకాంత్ కు ఆదిలోనే చెక్ చెప్పబోతున్నారా? అన్న చర్చ సర్వత్రా జరుగుతోంది.
రాజకీయాలపై నిజంగా ఆసక్తి ఉందా?
గతవారం బిగ్ బాస్ షో పై విలేకరుల సమావేశం సందర్భంగా తమిళనాడు ప్రభుత్వ శాఖలు అవినీతిమయంగా మారాయని కమల్ హాసన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఇటీవలి కాలంలో కమల్ వ్యాఖ్యలను గమనిస్తే రాజకీయాల పట్ల ఆయన ఆసక్తి చూపుతున్నారనే అనుమానం రాక మానదు. ముఖ్యంగా తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణం తర్వాత కమల్ హాసన్ రాజకీయాలపై విస్తృతంగా వ్యాఖ్యలు చేస్తున్నారు.
అయ్యో.. అంతా ఒట్టిదేనా?
ఆ తర్వాత కమల్ హాసన్ ఓ ప్రెస్ రిలీజ్ ద్వారా తన ట్వీట్ పై వివరణ ఇచ్చారు. ప్రో కబడ్డీ లీగ్ ఐదో సీజన్లో ‘తమిళ్ తలైవాస్' జట్టుకి కమల్ బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిచబోతున్నారు. ఈ విషయం ప్రకటించడానికే కమల్ సరదాగా ఇలా ట్వీట్లు పెట్టి కాసేపు తన అభిమానులను ఆటపట్టించారట. కమల్ ఇచ్చిన ఈ వివరణతో ఆయన అభిమానులు ప్రస్తుతానికి చల్లబడిపోయారు.