చెప్పులు, రాళ్ల దాడులకు భయపడను: నన్ను అరెస్టు చేస్తే, సమస్యలొస్తాయ్!
Recommended Video
చెన్నై: స్వతంత్ర భారత మొట్టమొదటి ఉగ్రవాది హిందూవేనని, అతని పేరు చంపిన నాధురామ్ గాడ్సే అని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మక్కళ్ నీథి మయ్యం అధినేత కమల్ హాసన్ తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. తాను ఇచ్చిన ఈ ప్రకటన నుంచి వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదని అన్నారు. హిందువుల్లోనే కాదు.. అన్ని మతాల్లోనూ ఉగ్రవాదులు ఉన్నారని అన్నారు. చెప్పులు విసరడం పట్ల తానేమీ చింతించటం లేదని అన్నారు. వాటికి భయపడే వాడిని కాదని కమల్ హాసన్ తేల్చి చెప్పారు. తాజాగా మధురైలోనూ ఆయనపై ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కోడిగుడ్లను విసిరారు. అసెంబ్లీ ఉప ఎన్నికల ప్రచారంలో ఉన్న ఆయనపై ఈ దాడి చోటు చేసుకుంది.
దీనిపై శుక్రవారం ఉదయం ఆయన చెన్నైలో విలేకరులతో మాట్లాడారు. రాజకీయాల్లో నైతిక విలువలను ఆశించడం పొరపాటవుతుందని చెప్పారు. ఉన్నత విలువలు, నైతికతతో కూడుకున్న రాజకీయాలు కనుమరుగయ్యాయని అన్నారు. తనపై చోటు చేసుకున్న ఈ దాడులే దీనికి నిదర్శనమని చెప్పారు.
నాథూరామ్ గాడ్సే హిందువు అని తానేమీ కొత్తగా చెప్పట్లేదని, ఆ విషయం అందరికీ తెలుసని అన్నారు. ప్రతి మతంలోనూ ఉగ్రవాదులు ఉన్నారనే విషయాన్ని ఎవరూ తవ్వి తీయాల్సిన పని లేదని, ఒక్కసారి చరిత్ర పుటలను వెనక్కి తిప్పి చూస్తే, అవే మనకు తేటతెల్లం చేస్తాయని కమల్హాసన్ అన్నారు.
కమల్ హాసన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా దుమారం చెలరేగుతోన్న విషయం తెలిసిందే. ఆయనపై కేసులు కూడా నమోదయ్యాయి. అరెస్టు చేస్తారనే ఊహాగానాలు నెలకొన్నాయి. దీనిపై ఆయన స్పందిస్తూ, అరెస్టు చేస్తారని తాను భయపడట్లేదని అన్నారు. అరెస్టు చేయనివ్వండి చూద్దాం.నన్ను అరెస్టు చేస్తే మరిన్ని సమస్యలు వస్తాయి. పరిస్థితి ఎంత వరకైనా వెళ్లొచ్చు. శాంతిభద్రతల సమస్యలు ఉత్పన్నం కావచ్చు.. అని అన్నారు. తాను హెచ్చరించడానికో, బెదిరించడానికో తాను ఈ మాటలు చెప్పట్లేదని, శాంతియువ వాతావరణానికి భంగం వాటిల్లకూడదని ముందుగానే సూచిస్తున్నానని అన్నారు.