స్వతంత్ర భారత్లో తొలి ఉగ్రవాది హిందూ: అగ్గి రాజేసిన లోకనాయకుడు
తమిళనాడు: ప్రముఖ నటుడు మక్కల్ నీది మయమ్ పార్టీ అధినేత కమల్ హాసన్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. ఎప్పుడూ హిందూత్వ పార్టీలపై విరుచుకుపడే కమల్ హాసన్ ఈసారి అదే కాన్సెప్ట్పై మరోసారి విరుచుకుపడ్డారు. స్వతంత్ర భారతదేశంలో తొలి ఉగ్రవాది ఎవరో చెప్పి సరికొత్త వివాదానికి తెరలేపారు. ఇంతకీ కమల్ చెప్పిన ఆ ఉగ్రవాది ఎవరు..? ఈ సమయంలో కమల్ వ్యాఖ్యలు ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తాయి..?
స్వతంత్ర భారతదేశంలో తొలి ఉగ్రవాది ఒక హిందువు
మక్కల్ నీది మయమ్ పార్టీ చీఫ్ కమల్ హాసన్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఈ సారి భారతీయుడు చేసిన వ్యాఖ్యలు పెనుదుమారమే రేపుతున్నాయి. స్వతంత్ర భారతదేశంలో తొలి ఉగ్రవాది ఒక హిందువు అని అదికూడా మహాత్మాగాంధీని హత్య చేసిన నాథూరాం గాడ్సే అని చెప్పి సరికొత్త వివాదానికి తెరతీశారు. అరవకురిచి అసెంబ్లీ స్థానానికి వచ్చే ఆదివారం ఉపఎన్నిక జరుగనున్న నేపథ్యంలో ఎంఎన్ఎం పార్టీ అభ్యర్థి తరపున ప్రచారం నిర్వహించారు కమల్ హాసన్. ఆ అసెంబ్లీ నియోజకవర్గంలో ముస్లిం సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు అత్యధికంగా ఉన్నారు. వారి ఓట్లను ఆకర్షించేందుకు ఈ వ్యాఖ్యలు తాను చేయడం లేదని ఉన్న వాస్తవాన్ని చెబుతున్నట్లు కమల్ హాసన్ క్లారిటీ ఇచ్చారు.
గాంధీజీని హత్య చేసిన గాడ్సే తొలి ఉగ్రవాది
ముస్లిం ఓట్ల కోసం గాడ్సే విషయాన్ని ప్రస్తావించడం లేదని గాంధీ మహాత్ముడి విగ్రహం ఎదుట నిల్చొని ఉన్న వాస్తవాన్ని చెబుతున్నానని కమల్ హాసన్ అన్నారు. స్వతంత్ర భారత దేశంలో తొలి ఉగ్రవాది ఒక హిందువు అని అతను మహాత్మా గాంధీని హత్యచేసిన నాథూరాం గాడ్సే అని చెప్పారు. నిజాలను ఎప్పటికీ చెరిగిపోవని ఆపై స్పష్టం చేశారు కమల్ హాసన్. తమ అభ్యర్థి మోహన్ రాజ్ను గెలిపించాలన్న కమల్ హాసన్.... తమిళనాడులో రాజకీయాల్లో త్వరలో విప్లవాత్మకమైన మార్పులు చోటుచేసుకుంటాయని చెప్పారు. ప్రజలు అన్నాడీఎంకే, డీఎంకే పార్టీలకు గట్టి గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నట్లు కమల్ హాసన్ చెప్పారు. ఈ రెండు పార్టీలు ప్రజల సాధకబాధకాలను పట్టించుకోవడం మానేశాయని అవినీతి కూపంలో ఇరుక్కుపోయాయని ధ్వజమెత్తిన లోకనాయకుడు.... అన్నాడీఎంకే, డీఎంకే పార్టీలు కడిగిన ముత్యంలా ఎప్పటికీ బయటపడలేవని జోస్యం చెప్పారు.
1948లో జరిగిన నాటి గాంధీ హత్యకు సమాధానం ఎవరిస్తారని ప్రశ్నించారు కమల్ హాసన్. భారతీయులు సమానత్వం కోరుకుంటారని చెప్పిన కమల్ హాసన్.. మూడురంగుల జెండాలో ఉన్న రంగులు అన్నీ కలిసి ఉండాలని చెబుతూ మనుషులంతా అలానే కలిసి ఉండాలని ఒక భారతీయుడిగా తానుకోరుకుంటున్నట్లు చెప్పారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇది తొలిసారి కాదు. నవంబర్ 2017లో హిందూ అతివాదంపై మాట్లాడి బీజేపీ ఇతర హిందూ సంఘాల నుంచి విమర్శలు ఎదుర్కొన్నారు.
ముస్లింల ఓట్ల కోసమే కమల్ తాపత్రయం
ఇక కమల్ చేసిన తాజా వ్యాఖ్యలపై బీజేపీ స్పందించింది. కమల్ హాసన్ నిప్పురాజేస్తున్నారని మండిపడింది. అరవకురిచి అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యధిక ఓటర్లు ముస్లిం సామాజిక వర్గం వారు ఉండటంతో వారి ఓట్ల కోసం ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు తమిళనాడు బీజేపీ చీఫ్ తమిలిసాయి సౌందర్రాజన్. ఏప్రిల్లో శ్రీలంకలో జరిగిన ఉగ్రదాడులపై కమల్ హాసన్ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. కొన్ని దశాబ్దాల నాటి ఘటనను తెరపైకి తిరిగి తీసుకురావడం వెనక కమల్ ఉద్దేశమేమిటని ఆమె ప్రశ్నించారు. గాంధీజీని హత్య చేసిన నాథూరాం గాడ్సేపై విచారణ జరిగింది అని గుర్తు చేసిన ఆమె... శిక్షను కూడా అమలు చేశారని చెప్పారు. తన సినిమాను కొన్ని మతసంస్థలు అడ్డుకుంటామని చెప్పినప్పుడు దేశాన్ని వీడి వెళతానని ఢాంభీకాలకు పోయిన కమల్ హాసన్... ఈరోజు తాను నిజమైన భారతీయుడునని ఎలా చెప్పుకుంటున్నారని ఆమె విమర్శించారు. ఇంతకాలం సినిమాల్లో నటించిన కమల్ హాసన్ ఇప్పుడు రాజకీయాల్లో అంతకంటే బాగా నటిస్తున్నారని తమిలిసాయి సౌందర్ రాజన్ ఎద్దేవా చేశారు.