జూన్ 4-11 వరకు పార్లమెంటు సమావేశాలు: వెంకయ్య
న్యూఢిల్లీ: పదహారవ పార్లమెంటు సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. ఈ మేరకు కేంద్రమంత్రి మండలి సమావేశం తేదీలను నిర్ణయించింది. జూన్ 4 నుంచి జూన్ 11 వరకు పార్లమెంటు సమావేశాలు జరుగుతాయని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు మీడియాకు తెలిపారు. జూన్ 9న ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రసంగిస్తారని చెప్పారు.
జూన్ 4, 5 తేదీల్లో పార్లమెంటు సభ్యుల ప్రమాణ స్వీకారం జరుగుతుందని తెలిపారు. జూన్ 6న స్పీకర్ ఎన్నిక ఉంటుందని చెప్పారు. ప్రొటెం స్పీకర్గా సీనియర్ ఎంపి కమల్నాథ్ వ్యవహరిస్తారని వెంకయ్య నాయుడు తెలిపారు. పరిపాలన, పథకాల అమలుపై ప్రత్యేక దృష్టి పెడతామని చెప్పారు. తమ ప్రభుత్వం విద్యా, వైద్యం, తాగునీరు, రోడ్లు, ఇతర మౌళిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు.
ప్రభుత్వం పాలనలో పారదర్శకత తీసుకొస్తామని వెంకయ్య నాయుడు చెప్పారు. రాష్ట్రాల సమస్యలను పరిష్కరించేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. ప్రధాని నివాసానికి నరేంద్ర మోడీ ఎప్పుడు వెళ్తారని అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. ఆయన వెళ్తారు కానీ, మాజీ కేంద్రమంత్రులు తమ ప్రభుత్వ నివాసాలను ఖాళీ చేస్తే నూతన మంత్రులు వస్తారని చెప్పారు.
కాగా, కేబినెట్ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ మంత్రివర్గ సభ్యులకు దిశా నిర్దేశం చేశారు. మంత్రులు అంశాల ప్రాధాన్యతను బట్టి వ్యవహరించాలని మంత్రులకు సూచించినట్లు తెలిసింది. 100 రోజుల్లో చేయబోయే పనుల ప్రణాళికలను రూపొందించాలని, ప్రతీ మంత్రీ ప్రగతి నివేదిక ఇవ్వాలని కోరినట్లు సమాచారం.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో వడోదర, వారణాసి లోకసభ స్థానాల నుంచి గెలిచిన నరేంద్ర మోడీ, వడోదర ఎంపి స్థానానికి రాజీనామా చేశారు. వారణిసి నుంచే ఆయన ఎంపిగా కొనసాగేందుకు నిర్ణయించుకున్నారు.