దమ్ముంటే నా ప్రభుత్వాన్ని కూల్చండి..బీజేపీకి కమల్నాథ్ సవాల్
భోపాల్ : దమ్ముంటే నా ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేయండి.. ఈ సవాల్ విసిరింది ఎవరో కాదు.... మధ్యప్రదేశ్ సీఎం కమల్నాథ్ బీజేపీ నేతలకు సవాల్ విసిరారు. బీజేపీ కేవలం మాటలు మాట్లాడుతుందే తప్ప తమ ప్రభుత్వాన్ని కూల్చే సత్తా లేదని అన్నారు. కమలనాథ్ ప్రభుత్వం ఏ క్షణమైనా కూలిపోయే అవకాశాలున్నాయని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, బీజేపీ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయ్ వర్గీయలు చేసిన వ్యాఖ్యలపై కమల్నాథ్ స్పందించారు. వారు తమ ప్రభుత్వంపై జాలి చూపిస్తున్నారా అంటూ ప్రశ్నించారు.
మధ్యప్రదేశ్ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని వారు తీర్పునిచ్చారని చెప్పిన కమల్నాథ్... బీజేపీ నేతలు తమ క్యాడర్లో స్ఫూర్తిని నింపేందుకే ప్రభుత్వం పడిపోతుందనే ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇదిలా ఉంటే ప్రజలు నిజంగానే కాంగ్రెస్ వైపు ఉంటే లోక్సభలో ఎందుకు దారుణ ఫలితాలు వచ్చాయన్న ప్రశ్నకు తెలివిగా సమాధానం ఇచ్చారు కమల్నాథ్. లోక్సభ ఎన్నికల తీర్పు రాష్ట్ర ప్రభుత్వం పనితీరు చూసి ఇచ్చినది కాదని అన్నారు.
Recommended Video
లోక్సభ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ వైపు లేదనే నిజాన్ని తాను ఒప్పుకుంటున్నానని అదే సమయంలో తమవైపు నుంచి కూడా వైఫల్యాలు ఉన్నట్లు కమల్నాథ్ చెప్పారు. ప్రజలకు తాము చేస్తామన్నది స్పష్టంగా వివరించలేకపోయామని కమల్నాథ్ చెప్పారు. జాతీయత ప్రధానాంశంగా ఎన్నికలు జరిగాయని కమల్నాథ్ చెప్పారు. అయితే బీజేపీ మాత్రం ఒక్క స్వాతంత్ర సమరయోధుడికి కూడా టికెట్ కేటాయించలేదని గుర్తు చేశారు.