కుమారస్వామిని ఏ గతి పట్టించామో చూశారుగా! మీ పరిస్థితీ అంతే: బీజేపీ వార్నింగ్ బెల్స్
భోపాల్: కర్ణాటకలో 14 నెలల పాటు అధికారంలో కొనసాగిన కాంగ్రెస్-జనతాదళ్ (సెక్యులర్) ప్రభుత్వాన్ని కూల్చివేసిన తరువాత భారతీయ జనతాపార్టీ నాయకుల్లో ఆత్మవిశ్వాసం.. అతివిశ్వాసంగా మారినట్టు కనిపిస్తోంది. బొటాబొటి మెజారిటీతో అధికారాన్ని అందుకున్న కాంగ్రెస్ పార్టీపై బెదిరింపులకు దిగుతున్నారు కమలనాథులు. ప్రస్తుతం వారి కన్ను మధ్యప్రదేశ్, రాజస్థాన్లపై పడింది. ఆపరేషన్ కమలను విజయవంతంగా అమలు చేసి, కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వానికి చరమగీతం పాడిన నేపథ్యంలో- మధ్యప్రదేశ్లో అధికారంలో ఉన్నకాంగ్రెస్ పార్టీని అస్థిర పరిచే చర్యలకు శ్రీకారం చుట్టడం ఖాయంగా కనిపిస్తోంది.
24 గంటల్లో దేశవ్యాప్తంగా భారీ వర్షాలు: తెలుగు రాష్ట్రాలు మినహా: ఐఎండీ
కుమార సర్కార్ పతనమైన మరుసటి రోజే.. వార్నింగ్ బెల్స్
మధ్యప్రదేశ్కు చెందిన బీజేపీ సీనియర్ నేత, ప్రతిపక్ష నాయకుడు గోపాల్ భార్గవ ఇలాంటి హెచ్చరికే జారీ చేశారు. దమ్ముంటే బలపరీక్షకు సిద్ధపడాలని ఆయన కమల్నాథ్ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. తమ ఢిల్లీ పెద్దలు ఒక్క సైగ చేస్తే.. 24 గంటలు తిరగకముందే ప్రభుత్వాన్ని కూల్చేస్తామని ఆయన నిండుసభలో ప్రకటించారు. కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి రాజీనామా చేసిన మరుసటి రోజే గోపాల్ భార్గవ అసెంబ్లీలో ఈ ప్రకటన చేయడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది.
ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత సవాల్
బడ్జెట్ ప్రతిపాదనలపై చర్చ సందర్భంగా మధ్యప్రదేశ్ శాసనసభలో ముఖ్యమంత్రి కమల్నాథ్, గోపాల్ భార్గవ మధ్య తీవ్రస్థాయిలో వాగ్వివాదం చోటు చేసుకుంది. వారిద్దరూ పరస్పరం సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకున్నారు. ఆరోపణలు, ప్రత్యారోపణలతో సభ దద్దరిల్లింది. కర్ణాటక తరహాలో ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి బీజేపీ కుట్ర పన్నుతోందని, దీన్ని సమర్థవంతంగా తిప్పికొడతామని కమల్నాథ్ అన్నారు. అమ్ముడు పోవడానికి తమ పార్టీలో ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా సిద్ధంగా లేరని చెప్పారు. తమ ప్రభుత్వం అయిదేళ్ల పాటు సుభిక్షంగా పరిపాలిస్తుందని, ఆ తరువాత కూడా అధికారంలోకి వస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తాము అమలు చేస్తోన్న పథకాలను ప్రజలు ఆదరిస్తున్నారని, బీజేపీ ఇక అధికారంలోకి రావాలనుకోవడం కలేనని చురకలు అంటించారు.
నంబర్ 1, నంబర్ 2 సైగలు చాలు..
దీనిపై గోపాల్ భార్గవ తీవ్రంగా స్పందించారు. కమల్నాథ్ ప్రభుత్వం ఏర్పాటై ఏడు నెలలైందని, ఇప్పటికే సమయం మించిపోయిందని అన్నారు. `మీరు ఏడు నెలలు పరిపాలించడమే గొప్ప. ఇక రోజులు లెక్కబెట్టుకోండి. మీ ప్రభుత్వం పతనం కావడానికి ఎంతో కాలం పట్టదు..` అని కమల్నాథ్ను ఉద్దేశించి అన్నారు. `మా పార్టీ నంబర్ 1, నంబర్ 2ల నుంచి వచ్చే ఓ చిన్న సైగ చాలు. 24 గంటలు కూడా మీరు అధికారంలో ఉండలేరు. మీ ప్రభుత్వాన్ని కూల్చడం చిటికెలు వేసినంత సులభం..` అంటూ ఆయన ప్రతిసవాల్ విసిరారు.
దమ్ముంటే మా ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టు..
దీనిపై కమల్నాథ్ సైతం అదే స్థాయిలో రెచ్చిపోయారు. బీజేపీకి దమ్ము, ధైర్యం ఉంటే ఇప్పటికిప్పుడే తమ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టగలరా? అని నిలదీశారు. `మీ పార్టీ నంబర్ 1, నంబర్ 2లు పాపం సున్నిత మనస్కులు. వారి ఆదేశాల కోసం ఎదురు చూడాల్సిన పని లేదు. మా ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని పెట్టే దమ్ము మీకు ఉందా?..` అని కమల్నాథ్ తీవ్ర స్వరంతో ప్రశ్నించారు. మధ్యప్రదేశ్లో గత ఏడాది డిసెంబర్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది కాంగ్రెస్. 15 సంవత్సరాల తరువాత తొలిసారిగా అధికారంలోకి రాగలిగింది.
కాంగ్రెస్కు బొటాబొటి మెజారిటీ..
230 మంది సభ్యులు ఉన్న మధ్యప్రదేశ్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 115 మంది సభ్యుల బలం అవసరం అవుతుంది. 121 మంది సభ్యుల సంఖ్యాబలంతో కాంగ్రెస్ అక్కడ ప్రభుత్వాన్ని నడిపిస్తోంది. నిజానికి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత బలం కాంగ్రెస్కు లేదు. హస్తం పార్టీకి 114 మంది సభ్యులే ఉన్నారు. నలుగురు స్వతంత్ర అభ్యర్థులు, సమాజ్వాది పార్టీ, బహుజన్ సమాజ్వాది పార్టీకి చెందిన ఎమ్మెల్యేల మద్దతుతో అధికారాన్ని ఏర్పాటు చేసింది. కాగా ప్రతిపక్ష స్థానంలో కూర్చున్న బీజేపీకి 109 మంది సభ్యులు ఉన్నారు.