రాష్ట్రానికి కమల్ కమిటీ: కెసిఆర్ వ్యాఖ్యలపై డిగ్గీ ఆరా
న్యూఢిల్లీ/హైదరాబాద్: కేంద్రమంత్రి కమల్ నాథ్ కమిటీ గురువారం రాష్ట్రానికి రానుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆయా అంశాలపై కమిటీలు వేసిన విషయం తెలిసిందే. కమల్ నాథ్ కమిటీ ఆస్తులు, ఉద్యోగుల పంపకాలపై పని చేస్తోంది. ఎల్లుండి కమల్ నాథ్ కమిటీ సచివాలయంలో సమావేశంకానుంది. ఉద్యోగులకు ప్రాతినిథ్యంపై చర్చించనున్నారు.
కెసిఆర్ వ్యాఖ్యలపై డిగ్గీ ఆర్
మాజీ మంత్రి జానా రెడ్డి, శాసన మండలి సభ్యుడు షబ్బీర్ అలీలకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ మంగళవారం ఫోన్ చేశారు. నిన్న తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు చేసిన వ్యాఖ్యల పైన ఆయన ఆరా తీసినట్లుగా తెలుస్తోంది.
రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెసు, తెరాసల మధ్య విలీన రాజకీయం వేడి రాజేస్తున్న విషయం తెలిసిందే. కెసిఆర్ తన పార్టీని కాంగ్రెసులో విలీనం చేయాలని తెలంగాణ కాంగ్రెసు నేతలు డిమాండ్ చేస్తున్నారు. కానీ, సోమవారం కెసిఆర్ విలీనం చేసేది లేదని చెప్పారు. కాంగ్రెసు పార్టీ అధిష్టానం కూడా కెసిఆర్ తన పార్టీని కాంగ్రెసులో విలీనం చేస్తారని భావిస్తూ వచ్చింది. కానీ ఆయన ముందుకు రాకపోవడంతో ఢిల్లీ పెద్దలు దీనిపై ఆరా తీస్తున్నారు.
ఢిల్లీకి గవర్నర్
ఢిల్లీకి గవర్నర్ రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ మంగళవారం మధ్యాహ్నం ఢిల్లీకి బయలుదేరారు. ఢిల్లీలో ఆయన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ తదితరులతో భేటీ కానున్నారు. హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే, రక్షణ మంత్రి ఎకె ఆంటోనీలతో కూడా భేటీ కానున్నారు. గవర్నర్ నరసింహన్ శుక్రవారం వరకు ఢిల్లీలోనే ఉండే అవకాశముంది. రాష్ట్ర పరిస్థితుల పైన ఆయన కేంద్రానికి నివేదిక సమర్పిస్తారు.