టి బిల్లుపై రేపే: కమల్నాథ్, ఓ వెదవ లీక్ చేశారు: అశోక్
న్యూఢిల్లీ: సస్పెన్షన్కు గురైన సీమాంధ్ర ప్రాంత పార్లమెంటు సభ్యులు, సభలో సీమాంధ్ర కేంద్రమంత్రులు వ్యవహారంపై పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కమల్ నాథ్ సోమవారం స్పందించారు. సస్పెన్షన్కు గురైన ఎంపీల వ్యవహారంపై స్పీకర్ మీరా కుమార్ నిర్ణయం తీసుకుంటారని కమల్ చెప్పారు. కేంద్రమంత్రులు సభకు ఆటంగం కలిగించరని తాను భావిస్తున్నానని చెప్పారు. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన వ్యక్తం చేయవచ్చునన్నారు. ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తివేసే చర్య తన పరిధిలో లేదన్నారు. రేపే తెలంగాణ బిల్లు పైన చర్చ ఉంటుందని కమల్ నాథ్ చెప్పారు.
ఓ వెదవ లీక్ చేశాడు: అశోక్ బాబు
లోకసభలో ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు (తెలంగాణ ముసాయిదా బిల్లు) ప్రవేశ పెట్టే సమయంలో సీమాంధ్ర ఎంపీల వ్యూహాన్ని ఓ వెదవ లీక్ చేశారని ఎపిఎన్జీవో అధ్యక్షులు అశోక్ బాబు మండిపడ్డారు. అది తెలియడం వల్లనే ఎంపీల పైన సభ సాక్షిగా దాడి జరిగిందన్నారు.
రాజ్నాథ్ ప్రకటనపై యనమల ట్విస్ట్
భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు రాజ్నాథ్ సింగ్ ప్రకటన పైన సీమాంధ్ర తెలుగుదేశం పార్టీ నేత యనమల రామకృష్ణుడు సోమవారం స్పందించారు. తెలంగాణకు తాము అనుకూలమని రాజ్నాథ్ తమ పార్టీ వైఖరి చెప్పారే తప్ప అవకతవకలతో కూడిన ఈ బిల్లుకు మద్దతిస్తామని ఆయన చెప్పలేదన్నారు.
విభజనపై కేంద్రం తీరును జాతీయ పార్టీలు సైతం తప్పుపడుతన్నాయన్నారు. అడ్డగోలుగా జరుగుతున్న విభజనకు బిజెపి అభ్యంతరం చెబుతుందనే తాము విశ్వసిస్తున్నామని చెప్పారు. ఇప్పుడు విభజనను ఆపకుండే దేశానికే ప్రమాదకరమన్నారు. తెలంగాణపై రాజ్నాత్ తమ పార్టీ విధానం మాత్రమే చెప్పారన్నారు.
రాజ్నాథ్తో సీమాంధ్ర ఎంపీల భేటీ
బిజెపి అధ్యక్షులు రాజ్నాథ్ సింగ్ను సీమాంధ్ర ప్రాంత కాంగ్రెసు ఎంపీలు కలిశారు. ఎంపీల పైన సస్పెన్షన్ వేటు ఎత్తివేసేలా చూడాలని కోరారు.