నడిరోడ్డుపై మహిళపై బీజేపీ నేతల దాడి...? వీడియో పోస్ట్ చేసిన కమల్నాథ్...
మధ్యప్రదేశ్లోని బేతుల్ జిల్లాలో కొంతమంది బీజేపీ నేతలు ఓ దళిత మహిళ,ఆమె కుమార్తెపై దాడికి పాల్పడ్డారని ఆరోపిస్తూ మాజీ ముఖ్యమంత్రి,కాంగ్రెస్ సీనియర్ నేత కమల్నాథ్ ట్విట్టర్లో ఓ వీడియో షేర్ చేశారు. దాడికి పాల్పడ్డ బీజేపీ నేతలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కమల్నాథ్ పోస్ట్ చేసిన వీడియోలో కొంతమంది వ్యక్తులు రోడ్డు పైనే మహిళపై దాడి చేయడం కనిపిస్తోంది. ఆమెను కింద పడేసి పిడి గుద్దులు కురిపించారు. జుట్టు పట్టుకుని ఈడ్చి కాళ్లతో తన్నారు. షర్ట్ లేకుండా ఉన్న ఓ వ్యక్తి ఊడిపోతున్న తన పంచెను సరిచేసుకుంటూ మరీ ఆమెపై దాడికి పాల్పడ్డాడు. ఆ సమయంలో బాధితురాలి కుమార్తె... తన తల్లిని విడిచిపెట్టాలంటూ గట్టిగా కేకలు పెట్టింది. అయినప్పటికీ వాళ్లు వినిపించుకోలేదు.
ఈ ఘటనపై కమల్నాథ్.. 'శివరాజ్ జీ... మీ ప్రభుత్వ హయాంలో మన సోదరిమణులకు ఎలాంటి దుస్థితి తలెత్తిందో చూడండి. పైగా నిందితులే రక్షించబడుతున్నారు. ఈ మహిళపై,ఆమె కుమార్తెలపై దాడి చేసినవాళ్లపై కఠిన చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నా.' అంటూ ట్వీట్ చేశారు.
ఇదే ఘటనపై పోలీసులు మాట్లాడుతూ... ఆ మహిళ,ఆమెతో గొడవపడుతున్న వ్యక్తి ఇద్దరూ ఇరుగుపొరుగు వారేనని చెప్పారు. ఇళ్ల ముందు పారేసిన చెత్త విషయంలో వారి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుని ఘర్షణకు దారి తీసిందన్నారు. మహిళపై దాడి చేసిన ఆ వ్యక్తి బీజేపీ కార్పోరేట్ అని చెబుతున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని స్థానిక పోలీస్ అధికారి ప్రసాద్ తెలిపారు.
बैतूल ज़िले के सारणी क्षेत्र के शोभापुर में एक दलित महिला व उसकी बेटियों से बदसलूकी का विरोध करने पर भाजपा नेताओ द्वारा सार्वजनिक रूप से बेरहमी से मारपीट की घटना सामने आयी है।
— Office Of Kamal Nath (@OfficeOfKNath) August 21, 2020
1/3 pic.twitter.com/6XshqfCuKx